news18-telugu
Updated: November 12, 2020, 1:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా వెళ్తుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సైతం తన నివేదికలో వెల్లడించింది. టెక్నికల్ గా భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తెలిపింది. నౌక్యాస్ట్ పేరుతో ఆర్బీఐ తొలిసారి నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సెప్టెంబర్ త్రైమాసికంలో మన దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో మాంద్యంలోకి వెళ్లినట్లేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర అధ్యక్షతన సమావేశమైన ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
(ఏప్రిల్- జూన్)తొలి త్రైమాసికంలోనూ జీడీపీ అధికంగా 24 శాతం క్షీణించింది. ఎప్పుడైనా రెండు త్రైమార్షికాల్లో వరుసగా ఇలా ఆర్థిక వ్యవస్థలో క్షీణత నమోదైతే సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లినట్లుగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తారు. అయితే అక్టోబర్-డిసెంబర్ మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని నివేదిక అభిప్రాయపడింది.
ఇదిలా ఉంటే ఆర్థిక మాంద్యానికి సంబంధించిన వివరాలు, లెక్కలను నవంబర్ 27న ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనుంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో అక్టోబర్లో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైందని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. ఈ కరోనా విపత్తు నుంచి బయటపడేందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్బీఐ అభిప్రాయపడింది.
Published by:
Nikhil Kumar S
First published:
November 12, 2020, 1:33 PM IST