IRDAI- KYC : కస్టమర్లు సులువుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పొందేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) చర్యలు తీసుకుంటోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఇటీవల బీమా సుగం పోర్టల్ను ఐఆర్డీఏఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మార్పును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 1 నుంచి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు KYC(నో యువర్ కస్టమర్) వివరాలను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ రూల్ అమల్లోకి వస్తే.. పాలసీ తీసుకొనే సమయంలోనే కేవైసీ పూర్తవుతుంది. దీంతో క్లెయిమ్ చేసే సమయంలో కొంత గందరగోళం తప్పుతుంది.
నవంబర్ 1 తర్వాత పాలసీ రెన్యూవల్ గడువు ఉంటే, KYC కంప్లైంట్ కావడానికి ఇన్సూరెన్స్ సంస్థకు ఫోటో, అడ్రస్ ప్రూఫ్ పంపాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పాలసీని కొనుగోలు చేసి, ఆసుపత్రిలో చేరిన సందర్భం ఉంటే, అడ్మిషన్ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి KYC డాక్యుమెంట్లను సమర్పించాలి. KYC నిబంధనలను పాటిస్తే క్లెయిమ్ సెటిల్మెంట్లు వేగంగా జరుగుతాయని లైవ్మింట్తో చెప్పారు Policyx.com వ్యవస్థాపకుడు, CEO నావల్ గోయెల్. అయితే దీనికి సంబంధించిన సర్క్యులర్ను IRDAI రిలీజ్ చేసిన తర్వాతే, వివరాలపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
క్లెయిమ్ సమయంలో కేవైసీ తప్పనిసరి
KYC వివరాలు లేకపోవడం వల్ల పాలసీదారులు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కోల్పోరని బజాజ్ క్యాపిటల్ జాయింట్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ లైమ్మింట్తో చెప్పారు. ప్రస్తుతం నాన్-లైఫ్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో KYC వివరాలు వాలంటరీగా అందజేయవచ్చని తెలిపారు. అయితే రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చేయడానికి అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం KYC డాక్యుమెంట్లు తప్పనిసరి. ఇప్పుడు పాలసీని కొనుగోలు చేసే సమయంలో KYC వివరాలను తప్పనిసరి చేయాలని రెగ్యులేటర్ ప్లాన్ చేస్తోంది. అంటే కొత్తగా పాలసీలు తీసుకునేవారు, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు KYC నిబంధనలు తప్పనిసరి అని బజాజ్ తెలిపారు.
కస్టమర్ సంతకం చేసిన, స్కాన్ చేసిన డాక్యుమెంట్ కాపీని, ప్రాసెసింగ్ కోసం ప్రీ ఆథరైజేషన్ రిక్వెస్ట్ను పంపాలని, క్లెయిమ్ సమయంలో అన్ని డాక్యుమెంట్ల కాపీలను అందించాలని బజాజ్ చెప్పారు. ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్లుగా పాస్పోర్ట్, పాన్ కార్డ్ , ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవాటిని పరిగణించవచ్చు. అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ మొదలైన కాపీలను ఇవ్వచ్చు.
అర్హులకే ప్రయోజనాలు
కేవైసీ విషయంలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లో-రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, హై-రిస్క్ కస్టమర్లకు ఒక సంవత్సరం కాలపరిమితి ఉంటుందని సెక్యూర్నౌ డైరెక్టర్ అభిషేక్ బోండియా లైవ్మింట్ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. ఆలోపు కస్టమర్లు కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా థర్డ్పార్టీలకు క్లెయిమ్స్ జరగవని, నామినీలు, అసైనీలు, పాలసీదారుల చట్టపరమైన వారసులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Insurence, KYC submissionsn