Electric Vehicles: జపాన్ వాహన తయారీ కంపెనీ హోండా భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగు పెట్టనుంది. దేశంలో త్వరలోనే రెండు ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికిల్స్ (Electric two wheeler vehicles)లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రోడ్మ్యాప్ను హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) విడుదల చేసింది. దేశీయంగా తయారైన విడి భాగాలతో ఈ టూ వీలర్స్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమ రెండు ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలను ఆవిష్కరిస్తామని కంపెనీ వెల్లడించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు రకాల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తీసుకొస్తామని HMSI ప్రకటించింది. ఇందులో ఒకటి మిడ్ రేంజ్ వాహనంగా రానుంది. రెండో మోడల్ మాత్రం బ్యాటరీలు మార్చుకునే(స్వాప్) సదుపాయంతో ‘హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ’గా రానుంది. అయితే ఈ రెండు వాహనాలు స్కూటర్లా? లేక మోటార్సైకిళ్లా? అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రాజెక్ట్ విద్యుత్’ కింద ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేస్తోంది.
దేశీయంగా తయారీ..
దేశంలో ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఈవీ రోడ్మ్యాప్ సహకరిస్తుందని HMSI మేనేజింగ్ డైరెక్టర్ అత్సుషి ఒగాటా వెల్లడించారు. ఆకర్షణీయమైన వాహనాల తయారీకి ఎక్స్క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఒగాటా తెలిపారు. తయారీతో సమాంతరంగా ఈవీ టెక్నాలజీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఆఫ్టర్సేల్స్ సర్వీసెస్పై పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కర్ణాటకలోని నాసరపుర ప్లాంట్లో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ని తయారు చేస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారైన బ్యాటరీలు, పీసీయూల వంటి వాటిని వీటి తయారీలో ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మోటారును మాత్రం హోండా ఇన్ హౌజ్లోనే డిజైన్ చేయనుంది.
WhatsApp: వాట్సాప్ కొత్త అప్డేట్.. త్వరలో ఎడిట్ ఫీచర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..
వీటికి పోటీగా..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వెహికిల్స్కి డిమాండ్ పెరుగుతోంది. టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ కంపెనీల వాహనాలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి హోండా ఎలక్ట్రిక్ వెహికిల్స్ పోటీ ఇవ్వనున్నాయి.
పది లక్షల వాహనాలే లక్ష్యంగా..
2030 నాటికి సంవత్సరానికి పదిలక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలనే లక్ష్యంతో హోండా కంపెనీ పనిచేస్తోంది. భారత్లో తయారు చేస్తున్న ఈ రెండు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని గ్లోబల్ మార్కెట్కి కూడా ఎగుమతి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ‘వర్క్షాప్ ఈ’(Workdhop E)తో హెచ్ఎమ్ఎస్ఐ సమన్వయం చేసుకోనుంది. ప్రస్తుతం హోండా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ స్వాప్పింగ్ పాయింట్స్, ఛార్జింగ్ కేబుల్స్ కలిగిన 6,000 టచ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతమున్న మోడళ్లను లేటెస్ట్ OBD2 రెగ్యులేషన్, E20(20శాతం ఇథనాల్, 80శాతం గ్యాసోలిన్) ఫ్యుయల్ నిబంధనలకు అనుగుణంగా మార్చనున్నట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఓషియేనియా రీజియన్లో ఎగుమతులను విస్తరించినట్లు HMSI వెల్లడించింది. గుజరాత్ ప్లాంట్ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు ఎగుమతులు చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దీనిని 20 మోడళ్లకు పెంచి 58 దేశాలకు విస్తరించాలని భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Vehicles, Evs, Honda