చాలా కాలంగా ఉపయోగిస్తున్న వాహనాలతో వాతావరణ కాలుష్యం(Polution) పెరగడంతోపాటు, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ లేని, కాలుష్య కారక వాహనాలను దశలవారీగా తొలగించే లక్ష్యంతో నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని(National Vehicle Scrappage Policy) 2021లో ప్రధాని మోదీ ప్రారంభించారు. 20 సంవత్సరాల కంటే పాతవైన ప్రైవేట్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాతవైన కమర్షియల్ వాహనాలను స్క్రాప్ కిందకు తప్పక మార్చాలని కేంద్రం పేర్కొంది. తాజాగా 15 ఏళ్లకు మించిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ప్రకటించింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జనవరి 19న విడుదల చేసిన ఓ ప్రకటనలో.. 15 ఏళ్లకు మించిన రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని బస్సుల సహా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ను ఏప్రిల్ 1 నుంచి రద్దు చేస్తామని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్ (సాయుధ, ఇతర ప్రత్యేక వాహనాలు), దేశ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిస్థితి, అంతర్గత భద్రతను నిర్వహించడానికి ఉపయోగించే వాహనాలకు నియమం నుంచి మినహాయింపు ఇచ్చింది.
రోడ్ ట్యాక్స్పై 25 శాతం రాయితీ
ఈ విషయంపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. వాహనం రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్లు మించిన వాహనాల డిస్పోజల్ను నియమాల ప్రకారం పూర్తి చేయాలి. మోటారు వాహనాల (రిజిస్ట్రేషన్, ఫంక్షన్స్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ) రూల్స్- 2021 ప్రకారం ఏర్పాటు చేసిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ద్వారా చేపట్టాలి. 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాప్ చేసిన తర్వాత కొనుగోలు చేసే వాహనాలకు రోడ్ ట్యాక్స్పై 25 శాతం వరకు పన్ను రాయితీని అందిస్తారు. కేంద్రం ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
తుక్కు పరిశ్రమల ఏర్పాటు
ప్రతి సిటీ సెంటర్కు 150 కిలోమీటర్ల పరిధిలో కనీసం ఒక ఆటోమొబైల్ స్క్రాపింగ్ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 2022లో చెప్పారు. భారతదేశం మొత్తం దక్షిణాసియాలో వాహనాల స్క్రాపింగ్ హబ్గా మారే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.
కొత్త నిబంధనల ప్రకారం.. భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు ఏ రాష్ట్రంలోనైనా నమోదు చేసుకున్న వాహనాలను అంగీకరించవచ్చు, స్క్రాప్ కిందకు మార్చవచ్చు. వాహనం రిజిస్టర్ అయిన ప్రాంతంతో సంబంధం లేకుండా మొత్తం ప్రక్రియ మొత్తం భారతదేశం ప్రాతిపదికన రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్ ద్వారా జరుగుతుంది. వాహన యజమానులు ఆన్లైన్లో వాహన్ పోర్టల్ ద్వారా స్క్రాపింగ్ ఫెసిలిటీ కోసం అప్లై చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, E vehicles, Scappage