కరోనా మహమ్మారి కారణంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు చేయడంలో అనేక మంది టాక్స్ పేయర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్ దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. సాధారణంగా ప్రతి ఏడాది ఐటీఆర్ దాఖలుకు జూలై 31 వరకు మాత్రమే గడువు ఉండేది. గడువు పొడగించడం పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే ఈ–ఫైలింగ్ గడువు పొడిగించినప్పటికీ, కేంద్రం కొత్తగా ప్రారంభించిన ఐటీ వెబ్సైట్లోని సాంకేతిక సమస్యల కారణంగా టాక్స్ పేయర్లు లేట్ ఫీజు, వడ్డీ వంటివి చెల్లించాల్సి వచ్చింది. ఆగస్టు 1వ తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసిన వారికి ఈ సమస్య ఎదురైంది. ఇలాంటి వారికి వడ్డీ, ఆలస్య రుసుమును వెనక్కి ఇచ్చేస్తామని ఐటీ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు పన్ను చెల్లింపు గడువు ఉన్నప్పటికీ.. ట్యాక్స్ చెల్లింపుదారులు అదనపు వడ్డీ, ఆలస్య రుసుము చెల్లించాల్సి వచ్చింది. దీనిపై టాక్స్ పేయర్ల నుంచి ఐటీ శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఐటీ శాఖ.. ‘‘ఈ–ఫైలింగ్ కొత్త వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పొరపాటు జరిగింది. ఈ పొరపాటును ఆగస్టు 1వ తేదీనే సరిదిద్దాం. అయితే అప్పటికే కొంత మంది ఆలస్య రుసుం, వడ్డీ వంటివి చెల్లించారు. వారందరికీ త్వరలోనే రీఫండ్ చేస్తాం” అని ట్వీట్ చేసింది.
SBI MF: ఎస్బీఐ నుంచి కొత్త మ్యూచువల్ ఫండ్... నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే చాలు
టాక్స్ పేయర్లు చెల్లించిన అదనపు వడ్డీకి సంబంధించిన సెక్షన్ 234 ఎ, లేట్ ఫీజు సెక్షన్ 234 ఎఫ్లను తొలగించినట్లు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్లో పేర్కొంది. ఇకపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐటీఆర్ తాజా సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆన్లైన్లో నేరుగా రిటర్న్స్ దాఖలు చేయవచ్చని తెలిపింది. ఇప్పటికే ఎవరైనా అదనపు ఛార్జీలను చెల్లించి రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని వెల్లడించింది.
కొత్త వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు..
ఆగస్టు 1న కొంతమంది టాక్స్పేయర్లు ఐటీఆర్ దాఖలు చేయగా వారు ఆలస్య రుసుము, అదనపు వడ్డీ వంటివి చెల్లించాల్సి వచ్చింది. ఈ సమస్యను అదే రోజు పరిష్కరించామని ఐటీ శాఖ చెబుతున్నా.. వారం తర్వాత కూడా అటువంటి సమస్యలే పునరావృతమైనట్లు టాక్స్ పేయర్లు వాపోతున్నారు.
కేంద్ర ఎంతో ఆర్బాటంగా కొత్త సైట్ను లాంచ్ చేసినప్పకీ ఇలాంటి సాఫ్ట్వేర్ లోపాలు కనిపించడంపై టాక్స్ పేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ సైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. సైట్లో మాత్రం ఇప్పటికీ 'కమింగ్ సూన్' అని చూపిస్తుంది. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గతంలో కొత్త రిటర్న్ ఫైలింగ్ సాఫ్ట్వేర్లోని కొన్ని సమస్యలను లేవనెత్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, TAX SAVING