ఎవ్వరినైనా తమ జీవితంలోని అందమైన అనుభూతులు, సంతోషాలు, సరదాల గురించి అడిగి చూడండి... దాదాపు అందరూ వేసవి సెలవులతో మొదలు పెడతారు. ఎందుకంటే అప్పుడే నచ్చిన ప్రాంతాలను చుట్టి రావడానికి, నచ్చిన వ్యక్తులతో గడపడానికి బోలెడు సమయం దొరుకుతుంది. ఇప్పుడు మళ్లీ సమ్మర్ వచ్చేసింది. ఒక్కొక్కటిగా విద్యార్థుల పరీక్షలు అయిపోతున్నాయి. కొన్ని రోజుల్లో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటిస్తారు. చాలా మంది ఇప్పటికే టూర్ ప్లాన్లు మొదలు పెట్టేశారు. మరి మీరు ఈ 2023 వేసవిలో ఎక్కడికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు? ఇండియాలో బీచ్, పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు వంటి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీ ప్లానింగ్కు సహాయపడేందుకు ఈ వివరాలను ఓ సారి చూసేయండి..
లడఖ్ నుంచి కేరళ వరకు బెస్ట్ ప్లేసెస్ ఇవే
ఇండియాలో వేసవి కాలంలో సందర్శించే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దేశంలోని ప్రతి గమ్యస్థానానికి దాని సొంత సంస్కృతి, చరిత్ర, అందమైన ప్రాంతాలు ఉన్నాయి. లడఖ్లోని సుందరమైన పర్వతాల నుంచి కేరళలోని ప్రశాంతమైన బ్యాక్వాటర్ల వరకు ప్రత్యేక అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.
EaseMyTrip సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టీ న్యూస్18తో మాట్లాడుతూ.. ‘2023 వేసవిలో ఎక్కువ మంది వెళ్లాలని కోరుకునే డెస్టినేషన్లలో లడఖ్ కచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపింగ్ కూడా చేయవచ్చు. మంచుతో నిండిన పర్వతాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఆ తర్వాత అండమాన్, నికోబార్ దీవులకు ఎక్కువ మంది వెళ్తారు. ఇవి సుందరమైన బీచ్లు, క్రిస్టల్-క్లియర్ వాటర్ విశేషంగా ఆకట్టుకుంటాయి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే దీవుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, చారిత్రాత్మక కట్టడాలను తెలుసుకోవచ్చు.’ అని చెప్పారు.
అదే విధంగా డార్జిలింగ్లోని టీ తోటల అందాలు చూపు తిప్పుకోనివ్వవని, ఇది కూడా మంచి ఆప్షన్ అని పిట్టీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని ఈ హిల్ స్టేషన్ హిమాలయాల సుందరమైన దృశ్యాలను, చల్లని వాతావరణాన్ని అందిస్తుందని, ఇక్కడ ట్రెక్కింగ్, టీ టూర్లు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, టైగర్ హిల్ సన్రైజ్ వ్యూ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు.
బెస్ట్ సమ్మర్ ట్రిప్ డెస్టినేషన్ల లిస్ట్లో గోవా తప్పకుండా ఉంటుందని తెలిపారు. అక్కడి బీచ్లు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్, పోర్చుగీస్ వారసత్వం, రుచికరమైన సీ ఫుడ్ తప్పక ఆనందించాల్సిందేనని అన్నారు. కేరళ కూడా వేసవిలో తప్పక పర్యటించాల్సిన ప్రాంతమని చెప్పారు. కేరళ బ్యాక్ వాటర్స్, బీచ్లు, అందమైన హిల్ స్టేషన్లకు ప్రసిద్ధి. హౌస్బోట్ రైడ్లు, ఆయుర్వేద చికిత్సలు, మున్నార్ టీ తోటలు, పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం వంటివి ఎక్స్పీరియన్స్ చేయవచ్చని పిట్టీ వివరించారు.
వైవిధ్యాలకు కొదవ లేదు
భారతదేశం వైవిధ్యభరితమైన ప్రాంతాలు, సంస్కృతులు, ప్రకృతుల సమాహారం. ఉత్తర హిమాలయ శ్రేణులు, మధ్య పీఠభూములు, దక్షిణ కొండలు, బీచ్లు, గంభీరమైన అడవులు, వన్యప్రాణులు ప్రత్యేక డెస్టినేషన్లను అందిస్తాయి. అవిస్ ఇండియా ఎండీ, CEO సునీల్ గుప్తా మాట్లాడుతూ.. ‘వేసవిలో ఎంజాయ్ చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి లడఖ్, కాశ్మీర్, మనాలి వంటి హిల్ స్టేషన్లు బెస్ట్ ఆప్షన్. మున్నార్, వాయనాడ్, కొడైకెనాల్ పర్వత ప్రాంతాలు కూడా ఆకర్షిస్తాయి. లోనావాలా, ఖండాలా, మహాబలేశ్వర్కి కూడా ఎక్కువ మంది సమ్మర్ ట్రిప్లు ప్లాన్ చేస్తారు.’ అని వివరించారు.
ఇంటర్నేషనల్ ట్రావెల్
ఈ సంవత్సరం వేసవిలో అంతర్జాతీయ & దేశీయ ప్రయాణాలకు డిమాండ్ ఉంది. ఇక్సిగో గ్రూప్ ఈసీవో, సహ వ్యవస్థాపకుడు అలోక్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం విమానాలు, హోటళ్లలో ఎక్కువ ఖర్చు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వేసవి సీజన్లో మరింత ఎక్కువ ట్రాఫిక్ని ఆశిస్తున్నాం. సమ్మర్ ట్రిప్ల కోసం ఎక్కువ మంది దుబాయ్, లండన్, మాల్దీవులు, యూఎస్, ఆస్ట్రేలియా వంటి దేశాల గురించి సెర్చ్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఫ్లైట్లలో టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. చివరి నిమిషాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయి.’ అని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.