ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటున్నారు. కరోనా మహమ్మారి అనంతరం సొంత ఇంటిని కలిగి ఉండడం తప్పనిసరి అని అంతా భావిస్తున్నారు. ఎవరి స్తోమతకు అనుగుణంగా వారి ఇల్లు సైజు, అందులోని వస్తువులు ఉంటాయి. తాజాగా ప్రముఖ డీమార్ట్ సంస్థ యజమాని రాధాకృష్ణన్ దమాని ముంబయిలో ఇల్లు కొనుగోలు చేశారు. ఆయన ఇల్లు కొంటే మాకేంటి అని అనుకుంటున్నారా? మీ ప్రశ్న కరెక్టే కానీ.. ఆయన ఇల్లు కొనడం ఇప్పుడు పెద్ద వార్తగా మారింది. అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అవునండీ.. ఆయన ఇల్లు కొన్నది మామూలు ప్రాంతంలో కాదు ముంబాయిలో అత్యంత కోటీశ్వరులు, పెద్ద పెద్ద సెలబ్రేటీలు ఉండే మల్బార్ హిల్స్ లో కావడం విశేషం. ఆ ఇల్లు ధర కూడా అంతా ఇంతా కాదు. అక్షరాల రూ. వేయి కోట్లకు ఆయన ఆ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయం వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంటి ధర ఇంత ఉంటుందా అంటూ షాక్ అవుతున్నారు. ఇంకా ఆ ఇంటి పరిమాణం విషయానికి వస్తే.. ఆ ఇంటి విస్తీర్ణం 5752.22 చదరపు అడుగులు కావడం విశేషం.
ఈ ఇంటి యొక్క మార్కెట్ విలువ దాదాపు రూ. 724 కోట్లు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఈ ఇంటి యొక్క స్టాంప్ డ్యూటీ కోసం దమాని రూ.30 కోట్లు చెల్లించారట. గత మార్చి 31 న ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేశారు. పుమచంద్ రాయ్చంద్ అండ్ సన్స్, పరేష్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్, ప్రేమ్చంద్ రాయ్చంద్ అండ్ సన్స్ నుంచి దమాని, ఆయన సోదరుడు గోపికిషన్ కొన్నారు. ఈ ఇంటిని దీనిని రాధాకృష్ణ దమాని అతని సోదరుడు గోపీకిషన్ కలిసి కొన్నారు.
2020లో విడుదలైన ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితా ప్రకారం రాధాకృష్ణన్ దమాని దేశంలోని నాలుగో అతి పెద్ద ధనవంతుడు కావడం విశేషం. దమాని మొత్తం ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని సమాచారం. రాధాకృష్ణన్ దమాని జీవితం ప్రారంభం గురించి తెలిస్తే మనం షాక్ అవడం గ్యారెంటీ. ఆయన ముంబయి టెనెంట్ బ్లాక్ లో ఒక్క రూమ్ అపార్ట్మెంట్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయనకు ఉన్న వ్యాపారాల్లో అత్యంత ఫేమస్ డీ-మార్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai