Highest Denominations: 2016వ సంవత్సరంలో మోదీ సర్కార్ బ్లాక్ మనీ తగ్గించడానికి డీమానిటైజేషన్(Demonitization) ప్రకటించింది. ఈ సమయంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. అనంతరం కరెన్సీ లభ్యత కోసం రూ.2000 నోట్లను తాత్కాలికంగా చెలామణిలోకి తీసుకొచ్చారు. దీన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ ఇటీవల ప్రకటించింది. ఈ నోట్లను తిరిగి ఇచ్చేందుకు 2023, సెప్టెంబర్ 30ను గడువు తేదీగా నిర్ణయించింది.
అయితే భారతదేశంలో ఇప్పటివరకు ముద్రించిన అత్యధిక విలువ గల నోటు ఇదేనని ఈ తరం ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇంతకన్నా ఎక్కువ విలువైన రెండు నోట్లను ఆర్బీఐ ముద్రించింది. అవే రూ.5,000, రూ.10,000 నోట్లు. వాటిని కూడా నల్లధనం నిల్వలను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది.
* ఎప్పుడు ముద్రించింది? ఎందుకు రద్దు చేసింది?
వలసరాజ్యాల కాలంలో (Colonial era), ఆర్బీఐ 1938లో రూ.10,000 నోటును ప్రవేశపెట్టింది. అయితే జనవరి 1946లో దానిని డీమానిటైజ్ చేసింది. అంటే ఇది 1946 తర్వాత చెల్లలేదు. ఈ నోటును 1954లో తిరిగి ప్రవేశపెట్టింది. మళ్లీ 1978లో శాశ్వతంగా డీమానిటైజ్ చేసింది. వ్యాపారుల లాభదాయక కార్యకలాపాల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ నోటును రద్దు చేసిందని నమ్ముతారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొత్త 5,000, 10,000 రూపాయల నోట్లను చెలామణిలోకి ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్ల తర్వాత 1954లో వీటిని ముద్రించారు.
తరువాత సుమారు 24 ఏళ్లుగా అంటే 1978 వరకు భారతదేశంలో 1,000, 5,000, 10,000 రూపాయల నోట్లతో సహా పెద్ద డినామినేషన్ కరెన్సీ నోట్లను సర్కులేషన్లో కొనసాగాయి. అయితే 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసింది. ఆల్ ఇండియా రేడియో ద్వారా డీమానిటైజేషన్ ప్రకటన వెలువడింది. అప్పట్లో పెద్ద నోట్ల వినియోగం పెద్దగా లేకపోవడంతో రద్దు ప్రకటన ప్రభావం అంతంత మాత్రమే ఉంది. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం, 1976 మార్చి 31 నాటికి, చెలామణిలో ఉన్న మొత్తం నగదు 7,144 కోట్ల రూపాయలుగా అంచనా.
ఈ మొత్తంలో రూ.87.91 కోట్ల విలువైన 1,000 నోట్లు (మొత్తం కరెన్సీలో సుమారు 1.2%), రూ.22.90 కోట్ల విలువైన 5,000 నోట్లు, రూ.10,000 రూపాయల విలువ కలిగిన 1,260 నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ 1.26 కోట్లు. ఇలా చూసుకుంటే మొత్తం కరెన్సీలో ఈ మూడు పెద్ద నోట్లలో 2% కంటే తక్కువ మొత్తం చెలామణిలో ఉన్నాయి.
Rs.2000 Exchange: బ్యాంకుల్లో రూ.2,000 నోట్లను ఎలా మార్చాలి? ఎలా డిపాజిట్ చేయాలి? రూల్స్ ఇవే..
ఇక 2016 డీమానిటైజేషన్ తరువాత మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలోని ఆర్బీఐ 5,000, 10,000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకురావాలని సూచించింది. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని ప్రభుత్వం బదులుగా 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. డీమానిటైజ్ చేసిన నోట్లను త్వరగా, సులభంగా ఎక్స్ఛేంజ్ చేయడానికి వీలుగా ఈ 2000 నోట్లను ఆర్బీఐ తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian currency