షుగర్, బీపీ లాంటి ఇబ్బందులతో బాదపడుతున్నవారు నిత్యం మందులు వాడాల్సిందే. వారికి ఖర్చులు తగ్గించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అతిత్వరలోనే అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా మధుమేహ రోగులకు శుభవార్త. టైప్-2 డయాబెటిక్ రోగులు ఉపయోగించే సిటాగ్లిప్టిన్ టాబ్లెట్ల ధర భారీగా తగ్గనుంది. షుగర్, బీపీతోపాటు టీబీ, క్యాన్సర్ చికిత్స, నివారణలకు ఉపయోగించే మొత్తం 39 రకాల మందులు, టీకాల ధరలు తగ్గనున్నాయి. జులై నెలాఖరు నుంచే తగ్గించిన ధరలు అందుబాటులోకి రానున్నాయి. వివరాలివే..
షుగర్ పేషెంట్లకు శుభవార్త వెలువడింది. ప్రస్తుతం టాబ్లెట్ల కోసం డయాబెటిక్ బాధితులు రోజుకు రూ.45 వరకు ఖర్చు చేస్తుంటారు. త్వరలో ఇది రూ.8 నుంచి రూ.15 మించకపోవచ్చు. అంటే ధర దాదాపు 70శాతం వరకు తగ్గవచ్చు. దీంతో దేశంలోని దాదాపు ఏడున్నర కోట్ల మంది మధుమేహ బాధితులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
డయాబెటీస్ రోగులు ఎక్కువగా సిటాగ్లిప్టిన్ ఔషధాన్ని వాడటం, అమెరికా ఫార్మా దిగ్గజం మెర్క్కు ఈ ఔషధంపై పేటెంట్ ఉండటం తెలిసిందే. జనువియా పేరుతో మెర్క్ కంపెనీ ఈ ఔషధాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తోంది. సిటాగ్లిప్టిన్పై మెర్క్కున్న పేటెంట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కాగా మెర్క్ భారత్లో ఎంఎస్డీ పేరుతో కార్యకలాపాలు సాగిస్తోంది. సన్ ఫార్మా మాత్రమే ఎంఎస్డీ నుంచి లైసెన్స్ పొంది ఈ ఔషధాలను విక్రయిస్తోంది.
కాగా గ్లెన్మార్క్ కంపెనీ ఇప్పటికే సిటాజిట్ పేరుతో 50, 100 ఎంజీ డోసేజిలో తన జెనరిక్ సిటాగ్లిప్టిన్ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. జనువియాతో పోలిస్తే దీని ధర మూడో వంతు మాత్రమే ఉంది. ఇక సిటాగ్లిప్టిన్ పేటెంట్ గడువు ముగుస్తుండటంతో సిప్లా, డాక్టర్ రెడ్డీ్సతో సహా మరో 40 కంపెనీలు త్వరలో తమ జెనరిక్ సిటాగ్లిప్టిన్ టాబ్లెట్లను మార్కెట్లో విడుదల చేయబోతున్నాయి. దీంతో ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు.
39 రకాల మందులు: కేన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల చికిత్స, నివారణలకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు తగ్గనున్నాయి. ఇందు కోసం నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఈ మందుల ధరలను సవరించనుంది. ఎఎల్ఈఎం కొత్తగా చేర్చిన జాబితాలోని మందులను ఎంత ధరకు విక్రయించాలో నేషనల్ ఫార్మసుటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.