సెర్చింజన్ దిగ్గజం గూగుల్కు భారత్ షాకిచ్చింది. ఇండియా కాంపిటీషన్ లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని గుర్తించి ఏకంగా రూ.136 కోట్ల జరిమానా విధిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సంస్థకు ఈ మేరకు నోటీసులు పంపింది. ముఖ్యంగా మొబైల్ తయారీ కంపెనీలతో కచ్చితంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడేలా, మార్కెట్ లో గూగుల్ గుత్తాధిపత్యం దిశగా ప్రయత్నం చేస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు జరిపి నిర్ధారించింది. ఇతర కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించకుండా పోటీతత్వం చెడగొట్టేలా గూగుల్ వ్యవహరిస్తోందని సీసీఐ తన నివేదికలో పేర్కొంది.
ఈ మేరకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు శాంసంగ్, షియోమీ, లావా, కార్బన్ సంస్థలతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సంస్థతో కుదర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని సీసీఐ నోటీసులు సైతం జారీ చేయడం గమనార్హం. అయితే భారత్ చట్టాలకు లోబడే తాము సేవలు అందిస్తున్నామని గూగుల్ వివరణ ఇచ్చింది. అంతే కాదు సీసీఐ మార్గదర్శకాలతోనే తమ కార్యకలాపాలు సాగుతాయని గూగుల్ ఇండియా స్పందించింది.
Published by:Krishna Adithya
First published:July 20, 2019, 20:54 IST