కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఇటీవల ఈకామర్స్ పేరుతో భారీగా మోసాలు పెరిగాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి ఆఫర్ల పేరుతో వినయోగదారులను ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు మోసం చేస్తున్నాయి. దీంతో వాటిపై నిషేధం విధించే దిశగా కేంద్రం యోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటోంది. ముఖ్యంగా సెర్చ్ రిజల్ట్ మోసాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు.. ఆన్ లైన్ ఫ్లాష్ సేల్ కు సంబంధించి కొత్త మార్గదర్శకలను ప్రకటించే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ఇకపై ఇ-కామర్స్ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి. వినియోగదారుల రక్షణ నిబంధనలకు సవరణలు చేపట్టాలని సోమవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచనలు చేసింది. దీంతో దేశంలో పెద్ద ఆన్లైన్ సంస్థలపై ప్రభావం పడనుంది.
ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నామంటోంది. ఆన్లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వద్ద ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్లో సెర్చ్ రిజల్ట్స్ను మోసపుచ్చి యూజర్లను తప్పుదోవ పట్టించడంపై నిషేధంతో పాటు కస్టమర్ల ఇబ్బందులను పరిష్కరించేందు కు ఈ-కామర్స్ సైట్లు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ను తప్పనిసరిగా నియమించుకోవాలన్నది మరో ప్రతిపాదన.
ఇదీ చదవండి: సెప్టెంబర్-అక్టోబర్లో గరిష్ఠస్థాయికి కరోనా? థర్డ్ వేవ్ వార్తల్లో వాస్తవమెంత?
ఏదేని చట్టం కింద నేర నివారణ, గుర్తింపు, దర్యాప్తు, విచారణకు సంబంధించి ఏ ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఆదేశాలు అందుకున్న 72 గంటల్లో ఈ-కామర్స్ వేదికలు అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధన లు, 2020లో ప్రభుత్వం పలు సవరణలను ప్రతిపాదించింది. ఆ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం కఠిన శిక్షలు వేయాలని నిర్ణయించారు. తాజా ప్రతిపాదనలకు సంబంధించిన సవరణలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజా ప్రతిపాదనలపై ప్రజలు తమ సలహాలను లేదా వారి అభిప్రాయాలను 15 రోజుల్లోగా.. అంటే జూలై 6, 2021 నాటికి js-ca@nic.in కు ఇమెయిల్ ద్వారా పంపవచ్చని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనుపమ్ మిశ్రా ప్రకటించారు.
ఈ కొత్త నిబంధనలతో దేశంలో ఇకామర్స్ సంస్థలు అందించే వస్తు, సేవల ‘ఫ్లాష్ సేల్’పై నిషేధం విధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆన్లైన్ సంస్థలు పరిమిత కాలంలో తక్కువ రేట్లతో ఫ్లాష్ సేల్ను అందిస్తున్న విధానాన్ని నియంత్రించాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇప్పటికే పోటీ వ్యతిరేక ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలపై మళ్లీ దర్యాప్తును వేగవంతం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Flipkart, Online business