ఇల్లు(House) అద్దెకి తీసుకునేవారు ఇకపై రూమ్ రెంట్తో పాటు 18 శాతం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్- జీఎస్టీ(GST) చెల్లించాలనే ప్రచారం వాస్తవం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నివాస గృహాల అద్దెపై ఎలాంటి ట్యాక్స్(Tax) లేదని పేర్కొంది. దీనిపై మీడియా(Media)లో వస్తున్న వ్యాఖ్యలు నిజం కావని వెల్లడించింది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రూమ్ను రెంటుకు తీసుకొని నివాసం ఉంటున్న ప్రతిఒక్కరూ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్టీ నమోదిత వ్యక్తులు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకు ఉండే వారెవరూ జీఎస్టీ పరిధిలోకి రారని తెలిపింది.
వ్యాపారులకు కూడా నో ట్యాక్స్
వ్యాపారులు, ఏదైనా సంస్థలో భాగస్వాములుగా ఉన్నవారు కుటుంబ అవసరాల కోసం ఇళ్లు అద్దెకు తీసుకుంటే, వారు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. జీఎస్టీలో రిజిస్టర్ అయిన వ్యక్తులు వాణిజ్య అసవరాల కోసం ఏదైనా ప్రాపర్టీని అద్దెకు తీసుకున్న సందర్భంలో మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని, ఆస్తి యజమానిపై GST చెల్లించాల్సిన బాధ్యత లేదని కేంద్రం స్పష్టం చేసింది. రూమ్ రెంట్పై 18 శాతం జీఎస్టీ విధించారంటూ మీడియాలో వస్తున్న ప్రచారానికి తాజా నోటిఫికేషన్ చెక్ పెట్టింది.
నమోదిత వ్యక్తులు ఎవరు?
GST చట్టం ప్రకారం నమోదిత వ్యక్తులో వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. వ్యాపారం లేదా వృత్తిని నిర్వహిస్తున్న వ్యక్తి థ్రెషోల్డ్ లిమిట్ కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్కు చేరుకున్నప్పుడు GSTలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. GSTలో నమోదవ్వాల్సిన థ్రెషోల్డ్ లిమిట్ అనేది వ్యాపారం స్వభావం, స్థలాన్ని బట్టి మారుతుంది. సేవలను సరఫరా చేసే నమోదిత వ్యక్తికి ఆర్థిక సంవత్సరంలో థ్రెషోల్డ్ లిమిట్ రూ. 20 లక్షలు ఉంటుంది. కేవలం వస్తువుల సరఫరాదారుల యాన్యువల్ థ్రెషోల్డ్ లిమిట్ రూ.40 లక్షలు. అయితే రిజిస్టర్డ్ ఎంటిటీ ఏదైనా ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఉంటే.. ఈ థ్రెషోల్డ్ లిమిట్ ఆర్థిక సంవత్సరానికి రూ.10 లక్షలుగా ఉంటుంది.
ఎవరిపై ప్రభావం పడుతుంది..?
GST కౌన్సిల్ 47వ సమావేశం తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. రెసిడెన్షియల్ ప్రాపర్టీలను అద్దెకు లేదా లీజుకు తీసుకున్న కంపెనీలు, ప్రొఫెషనల్స్పై కొంత ప్రభావం పడనుంది.
గెస్ట్ హౌస్లుగా లేదా ఉద్యోగుల నివాసాలుగా ఉపయోగించేందుకు అద్దెకు తీసుకున్న హౌస్ ప్రాపర్టీలపై కంపెనీలు చెల్లించే అద్దెపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో ఉద్యోగులకు ఉచిత వసతి కల్పిస్తున్న కంపెనీలపై ఉద్యోగుల ఖర్చుల రూపంలో ప్రభావం పడుతుంది. అయితే జీఎస్టీ పరిధిలోకి రాని వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. నివాస గృహాలను ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇస్తే వాటిపై జీఎస్టీ వర్తించదని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. రెసిడెన్షియల్ యూనిట్ను వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే జీఎస్టీ విధిస్తామని ప్రభుత్వం ఒక ట్వీట్లో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.