కొత్తగా బడ్జెట్ (Budget) వస్తుందనగానే వేటి ధరలు పెరుగుతాయి, ఏయే విషయాల్లో సామాన్యులకు ఉపశమనం కలుగుతుందనే విషయాలపై అందరూ ఆరా తీస్తారు. అయితే రైల్వేస్ విషయంలో కూడా ఏమేం ప్రకటనలు చేస్తారా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. 2023, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను కూడా సమర్పించనున్నారు. దీంతో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు.. తదితర విషయాలపై అందరిలోనూ ఈ బడ్జెట్ ఆసక్తిని నింపుతోంది.
ఈ ఏడాది బడ్జెట్లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీటిపై ఏం చర్యలు తీసుకుంటారన్నదని ఆసక్తిగా మారింది.
* రికార్డు స్థాయిలో బడ్జెట్?
భారతీయ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బడ్జెట్ను పెంచే అవకాశాలు ఉన్నాయి. రైళ్ల ఆధునీకరణ, విద్యుదీకరణ, కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, సిగ్నలింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, సరుకు రవాణా కారిడార్లతో సహా వివిధ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది.
రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో క్యాపిటల్ ఎక్స్పెండీచర్ కింద రూ. 1.37 ట్రిలియన్లు, రెవిన్యూ ఎక్స్పెండీచర్ కింద రూ. 3,267 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండీచర్తో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
* మరిన్ని వందే భారత్ రైళ్లు?
2024 మొదటి క్వార్టర్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వందే భారత్ రైలు(Vande Bharat Trains) రీవ్యాంప్డ్ స్లీపర్ వెర్షన్ గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు ప్రకటించిన దానికి మించి ఈ ఏడాది బడ్జెట్లో మరో 400 కొత్త వందే భారత్ రైళ్ల ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించే అవకాశం ఉంది. రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్దీ ఎక్స్ప్రెస్లు సహా అన్ని హైస్పీడ్ రైళ్లను ఒక్కొక్కటిగా పక్కన పెట్టి వాటి స్థానంలో అన్ని చోట్లా వందే భారత్ రైళ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచనలో ఉంది. ప్రధాన మార్గాల్లో వేగాన్ని గంటకు 180 కిలోమీటర్ల స్థాయికి పెంచాలని చూస్తోంది.
2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం స్టాండర్డ్-గేజ్ వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఇటీవల చెప్పారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే 180 కిమీ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో రైళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఎనిమిది దేశాల సరసన భారత్ చేరుతుంది. 2025-2026 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్లకు ఎగుమతి చేయడానికి రైళ్లను తయారు చేయాలని కూడా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
* బుల్లెట్ రైలు రానుందా?
2023-24 బడ్జెట్లో అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశం మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని రైల్వే మంత్రి వైష్ణవ్ ఇటీవల చెప్పారు. ఇప్పటికే 110 కిలోమీటర్ల ట్రాక్ను నిర్మించామని, అయితే డిజైన్ సంక్లిష్టత కారణంగా ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.
* బడ్జెట్ 2023లో కొత్త రైల్వే ట్రాక్లు?
2024 ఆర్థిక సంవత్సరంలో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లను విద్యుదీకరించడానికి, మొత్తం నెట్వర్క్ విద్యుదీకరణ పనులు పూర్తి చేయడానికి రూ.10 వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. రాబోయే 25 ఏళ్లలో 100,000 కి.మీ కొత్త రైల్వే ట్రాక్లను వేయాలని ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయి. వచ్చే బడ్జెట్లో దీనికి సంబంధించిన విషయాలను కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. దేశంలో సెమీ హై స్పీడ్ రైళ్ల సంఖ్యను పెంచడానికి నెట్వర్క్ను ఆధునీకరించడంతోపాటు రైలు వేగాన్ని పెంచడం దీని లక్ష్యం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Budget 2023-24, Central Government, Indian Railways, Vande Bharat Train