భారత్ (India) లో ప్రస్తుత జనాభా 130 కోట్లకు పైగా ఉండగా మరి కొన్ని నెలల్లో చైనా (China)ను మించిపోనుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనున్న తరుణంలో ప్రజారోగ్యం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకోసం 2023-24 బడ్జెట్లో గతంలో కన్నా ఎక్కువ నిధులు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద ప్రజారోగ్యానికి ప్రభుత్వం నిధులు వెచ్చిస్తుంది. ఈసారి ఎక్కువ కేటాయించడం వల్ల సామాన్యులకు మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
2023-24 బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కోసం రూ. 7200 కోట్లు ప్రకటించారు. ఇందులో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం రూ. 646 కోట్లు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6,412 కోట్లు ప్రకటించారు. అంటే గతంలో కన్నా 12 శాతం ఎక్కువ ఈసారి కేటాయించారు.
ఈ పథకంలో అర్హులైన వారికి ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తారు. వీరి కోసం ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తారు. ఈ పథకం ఒడిశా , పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో తప్ప మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న వారికి వర్తిస్తుంది. ఇప్పటి దాకా సుమారు 10.7కోట్ల మంది ప్రజలకు దీన్ని వర్తింపజేశారు. 2022 డిసెంబర్ 4 నాటికి 20.96 కోట్ల కార్డులు అందజేశామని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. 4.28 కోట్ల మంది ప్రజలకు సుమారు రూ.48,954 కోట్ల విలువైన వైద్యం అందిందన్నారు.
* ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి, ఒక ఎలక్ట్రానిక్ కార్డును అందిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మిషన్ నిర్వహిస్తుండగా, సుమారు 800కు పైగా ఐటీ కంపెనీలు ఇందులో పనిచేస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి, సరైన వైద్య సదుపాయం లేని పల్లెల్లో నివసించేవారికి టెలీమెడిసిన్ అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
* సికిల్ సెల్ అనీమియా నివారణ లక్ష్యం..
2047 నాటికి దేశంలో సికిల్ సెల్ అనీమియా నివారణే లక్ష్యంగా కేంద్ర ఒక ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ తెలిపారు. ఈ మిషన్లో గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న 0 నుంచి 40 ఏళ్ల వయసు గల 7 కోట్ల మందికి కౌన్సెలింగ్ చేయడంతో పాటు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కేంద్రం, రాష్ర్టాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మిషన్ నడుస్తుందని నిర్మలమ్మ ప్రకటించారు.
ఇది కూడా చదవండి : రైతులకు కేంద్రం అండ.. ఎరువుల సబ్సిడీలకు భారీగా కేటాయింపు..
* హెల్త్ బడ్జెట్ కీ పాయింట్స్
దేశంలో 2014 నుంచి 157 వైద్య కళాశాలలు స్థాపించగా, వాటికి అనుసంధానంగా 157 నర్సింగ్ కాలేజీలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల సిబ్బందిని పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు ఐసీఎంఆర్ ICMR ల్యాబ్లలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం ప్రకటించింది. ఫార్మా రంగంలో పరిశోధనలు పెరిగేలా, మరింత అభివృద్ధి సాధించేలా పెట్టుబడులను ప్రోత్సహించనుంది. ప్రస్తుత వైద్య అవసరాలు తీర్చడానికి నిపుణులు ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం ఆధునిక వైద్యం, సాంకేతికత, పరికరాల తయారీ, పరిశోధన వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayushman Bharat, Budget 2023, Central Government, Nirmala sitharaman