ఆర్థిక మాంద్యం కారణంగా గత కొన్ని నెలలుగా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల (Employees)ను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. మెటా (Meta), అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft), ఆల్ఫాబెట్ (Alphabet), బైజూస్ (Byjus) వంటి అనేక ప్రముఖ సంస్థలు దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే కొన్ని వారాల క్రితమే 18,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన అమెజాన్ మరో 9,000 మందిని తొలగించనుంది. గతంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్, పీపుల్ ఎక్స్పీరియన్స్ తదితర విభాగాల్లోని ఎంప్లాయీస్కు లేఆఫ్స్ ప్రకటించిన యాజమాన్యం.. ఈసారి అమెజాన్ క్లౌడ్, అడ్వర్టైజింగ్ తదితర విభాగాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ మంచి కోసమే ఇదంతా చేస్తున్నట్లు సంస్థ సీఈఓ ప్రకటించడం గమనార్హం.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు కారణంగా కంపెనీల ఆదాయం పడిపోతుంది. గత కొన్నేళ్లుగా సిబ్బంది నియామకం గణనీయంగా జరిగిందని, ఆర్థిక అనిశ్చితి కారణంగా కోత విధించాల్సి వస్తుందని ఆయా సంస్థల యాజమాన్యం చెబుతోంది. 2022లో అమెజాన్ 2.7 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చవిచూడగా, గత ఏడాది నాలుగో త్రైమాసికంలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం తగ్గినట్లు తన నివేదికలో పేర్కొంది.
* 9% మంది ఉద్యోగుల తొలగింపు
గత నవంబర్లో 18 వేల మందిని తొలగించిన అమెజాన్ ఇప్పుడు మరో 9 వేల మందికి లేఆఫ్స్ ప్రకటించనుంది. దీంతో ఈ సంఖ్య 27 వేలకు చేరింది. అమెజాన్ చరిత్రలో ఇది మరో అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. సంస్థలోని మూడు లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగుల్లో 9% మందిని తగ్గించుకుంది.
ఇది కూడా చదవండి : మరొకరి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. కొత్త టెక్నాలజీతో అద్భుతాలు..
* దీర్ఘకాల లక్ష్యాల కోసం
సోమవారం కొందరు ఉద్యోగులకు అమెజాన్ మెమోలు జారీ చేసింది. దీనికి సంబంధించి అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా ఎక్కువగా నియామకాలు చేపట్టామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి వల్ల కొందరు ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందన్నారు. రాబోయే కాలంలో నష్టాల నుంచి సంస్థ బయటపడేందుకు ఉద్యోగుల సంఖ్య తగ్గించుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
* ఆశ్చర్యకరంగా లేదు
ప్రపంచంలోనే దిగ్గజ టెక్ సంస్థలు కొన్ని నెలలుగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. గత వారం 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. ఇప్పుడు అమెజాన్ నుంచి ప్రకటన వచ్చింది. అయితే సంస్థ తీసుకున్న నిర్ణయం ఆశ్చరకరంగా లేదని టామ్ ఫోర్టేకు చెందిన విశ్లేషకుడు డీఏ డేవిడ్సన్ తెలిపారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో తమ ఖర్చులు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి వార్తలు మరెన్ని వినాల్సి వస్తుందోనని టెక్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.