TTD News: నిన్న వైకుంఠ ఏకాదశి ఇవాళ ద్వాదశి కావడంతో... పుష్కరిణిలో తీర్థ ముక్కోటిని నిర్వహించారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. కరోనా కారణంగా చక్రస్నానాన్ని TTD ఏకాంతంగానే నిర్వహించింది. కొద్ది మంది ఆలయ పండితులు, సిబ్బంది మాత్రమే ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐతే... నిన్న హుండీ ఆదాయం కరోనా తర్వాత దర్శనాల్లో రికార్డులు సృష్టించింది. నిన్న వైకుంఠ ద్వారం ద్వారా 42,825 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో పెద్ద మొత్తంలో కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లంచుకున్నారు. ఫలితంగా నిన్న శ్రీవారికి రూ.4.39 కోట్ల హుండీ ఆదాయం లభించింది. లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఇంత ఎక్కువ రావడం ఇదే తొలిసారి.
భారీగా ఆదాయం:
తిరుమల చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. అందువల్ల మిగిలిన ఈ 9 రోజులు స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అందువల్ల ఈ పది రోజులూ హుండీ ఆదాయం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ నెలలో ఇప్పటికే 5 సార్లు హుండీ ఆదాయం రూ.3 కోట్లు దాటింది. గురువారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఏడు కొండలకు తరలివచ్చారు. ఆ ఒక్క రోజే శ్రీవారిని 31,475 మంది దర్శించుకున్నారు. 11,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.79 కోట్లు లభించింది. ఇలా ఆదాయం పెరుగుతండటంతో పాటూ.... టీటీడీకి కరోనాకి ముందు ఉన్న రష్ మళ్లీ ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది.
భారీ సంఖ్యలో భక్తులు:
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గడంతో... టీటీడీ కూడా కరోనా రూల్స్ క్రమంగా సవరిస్తోంది. సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. దాంతో సామాన్య భక్తుల సంఖ్య పెరిగింది. తాజాగా వైకుంఠ ఏకాదశి కావడంతో.. తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కనిపించింది. కరోనా లాక్డౌన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎక్కువమంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా 25 అర్ధరాత్రి 12.05 నుంచి 1.30 గంటల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి కైంకర్యాలు జరిపారు. తర్వాత వేకువజామున 4.30 గంటల నుంచి భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. ఇవాళ కూడా వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంత మంది వచ్చినా... టీటీడీ అధికారులు... కరోనా రూల్స్ ప్రకారం భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమల షాపింగ్ కాంప్లెక్సులు కూడా ఇప్పుడు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఇది కూడా చదవండి:Hanuman in Tree: చెట్టులో కనిపించిన ఆంజనేయ స్వామి. తరలివస్తున్న భక్తులు
వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం టీటీడీ తీసుకున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన నిర్ణయాన్ని భక్తులు మెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala, Tirumala news, Tirupati, Ttd