విజయవాడ సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద వైఎస్ఆర్సీపీ మహిళానేత దేవళ్ల రేవతి హల్ చల్ చేశారు. ప్రస్తుతం వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె గుంటూరు నుంచి విజయవాడ వస్తుండగా.. కాజా టోల్ ప్లాజా వద్ద సిబ్బంది టోల్ చెల్లించాల్సిందిగా కోరారు. దీంతో రెచ్చిపోయిన ఆమె కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అయిన నన్నే టోల్ ఫీజు కట్టమంటారా అంటూ సిబ్బందిపై వీరంగం వేశారు. అంతేకాదు తన కారుకు అడ్డుగా పెట్టిన బారికేట్లని స్వయంగా ఆమె తోసేశారు. అక్కడితో ఆగకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు.
వైసీపీ నేత దేవళ్ల రేవతి నిర్వాకంతో టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వంద రూపాయలు టోల్ ఫీజు కూడా చెల్లించకుండా దౌర్జన్యానికి దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రేవతి దౌర్జన్యానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గతంలో కూడా అధికార పార్టీలకు చెందిన నేతలు, వారి బంధువులు టోల్ ప్లాజాలా వద్ద ఇలాగే వీరంగం వేసిన సందర్భాలున్నాయి. సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యాంగపదవుల్లో ఉన్నవారు, ఆర్మీ వాహనాలకు మాత్రమే టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది. అలా చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారికి మినహాయింపులుండవు. అధికారంలో ఉన్నాం కాబట్టి మేమెందుకు చెల్లించాలన్న ధీమానో లేక తెలియని తనమో తెలియదుగానీ ఇలాంటి నేతల వల్ల ప్రభుత్వాలకి చెడ్డపేరు వస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Guntur, Vijayawada, Ysrcp