Ys Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ కు సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని సీబీఐ పలుమార్లు విచారించి ఈనెల 10న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో సీబీఐ (CBI) విచారణపై ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు కీలకంగా మారింది.
సీబీఐ విచారణ సందర్బంగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐకి (CBI) ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. అలాగే న్యాయవాది సమక్షంలోనే సీబీఐ విచారణ జరిగేలా చూడాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు తనకు 150 సీఆర్పీసీ కింద సీబీఐ (CBI) నోటీసులు ఇచ్చిందని..ఈ నోటీసుల ప్రకారం తనను అరెస్ట్ చేయకూడదని కోర్టు సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు సమర్పించిన పిటీషన్ లో అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) పేర్కొన్నారు. కాగా రేపు అవినాష్ రెడ్డి సీబీఐ (CBI) విచారణ ఉన్న నేపథ్యంలో కోర్టుకెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే..వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.
3 ఏళ్లుగా దర్యాప్తు..
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. మరి రానున్న రోజుల్లో సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, CBI, Telangana, Ys viveka murder case, YS Vivekananda reddy