P Anand Mohan, Visakhpatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP), టీడీపీ (TDP) రెండూ అధికార, ప్రతిపక్ష హోదాల్లో ఉన్నాయి. రెండు పార్టీలకు కార్యకర్త నుంచి బడా నేత వరకు పడదు. వ్యక్తిగతంగా గౌరవాలు ఇచ్చిపుచ్చుకున్నా.. రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా వేర్వేరు ధృవాలు. ఐతే ఓ ముఖ్యనగరంలో మాత్రం రెండు పార్టీ నేతలు కలిసిపోయారు. అక్కడితో ఆగలేదు. ఏకంగా అవినీతి దందాకు తెరలేపి వాటాలు వేసుకుంటున్నారు. ఏపీలో అతిపెద్దనగరం విశాఖపట్నం. మహా విశాఖ నగర పాలక సంస్థ జోన్-6 (గాజువాక) పరిధిలో గల ఒక డివిజన్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్, వైసీపీ డివిజన్ ఇన్ ఛార్జ్ కుమ్మక్కైపోయారు. ఇద్దరూ చేతులు కలిపి తమ దందాలో ఓ టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగిని భాగం చేశారు. వార్డు పరిధిలో ఎవరు నిర్మాణాలు చేపట్టినా భారీగా డబ్బులు గుంజుతున్నారు. ప్లాన్ కోసం జీవీఎంసీకి అన్ని ఫీజులు కట్టినా... తమకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు. వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్ లు.. చివరగా సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారిని కూడా వీరు వదలడం లేదు.
గాజువాక ప్రాంతంలో జరుగుతున్న ఈ దందాపై జీవీఎంసీ ఉన్నతాధికారులకు సమాచారం వున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీ జోన్-6 (గాజువాక)లోని కొన్ని వార్డుల్లో భవన నిర్మాణాల విషయంలో అధికార పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ చార్జుల జోక్యం మితిమీరుతోంది. తమను ప్రసన్నం చేసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన వారిని టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారు. సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గమని తమకు సమాచారం ఇచ్చిన నేతను కలవాలంటూ సదరు ఉద్యోగి సలహా ఇస్తుంటారు. సదరు నేతను కలిస్తే భవనం విస్తీర్ణాన్ని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత సమర్పించుకుంటే తిరిగి పని చేసుకునేందుకు అనుమతిస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఈ దందా నడుస్తున్నా.., రెండు నెలల కిందట ఆ జోన్కు వచ్చిన ఉద్యోగి సదరు నేతలతో కుమ్మక్కు కావడంతో మరింత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆ వార్డులో ఇటీవల ఒకరు తన స్థలంలో భవనం నిర్మాణం చేపట్టారు. ఆయన వద్దకు సదరు టౌన్ప్లానింగ్ ఉద్యోగి ఈనెల 13న వెళ్లి నిర్మాణపనులు నిలిపివేయాలని ఆదేశించారు. తాను ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నానని భవన యజమాని చెప్పగా, ఆ వార్డు కార్పొరేటర్ను కలసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలా ఒక్కో భవనం విస్తీర్ణం, అంతస్తులను బట్టి లక్షల్లో వారికి ముట్టజెప్పాల్సి వస్తోంది.
గత ఏడాది మార్చిలో జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి వారిద్దరూ టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో, అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నేత వార్డు ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. తర్వాత టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్ వైసీపీకి దగ్గరవడంతో డివిజన్లోని ప్రాంతాలను ఇద్దరూ వాటాలుగా పంచుకుని వ్యవహారాలను నడుపుతున్నారు. తమ ప్రాంతంలో జరిగే నిర్మాణాలకు సంబంధించి యజమానులు, నిర్మాణదారులు కచ్చితంగా తమను కలిసేలా టౌన్ప్లానింగ్ ఉద్యోగికి ఆదేశాలు జారీచేశారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు వేడుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, TDP, Visakhapatnam, Ysrcp