పెళ్లైన తర్వాత కూడా కొందరు పైత్యం పీక్స్ కు చేరడంతో అక్రమ సంబంధాల వెంటపడుతుంటారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన వారికంటే.. వివాహేతర సంబంధం పెట్టుకున్నవాళ్లే ఎక్కవైపోతున్నారు. అలా ప్రియుడి మోజులో పడిపోయిన ఓ భార్య.. తప్పని చెప్పిన భర్తను మట్టుబెట్టించింది. పక్కా స్కెచ్ తో మేనత్త, ప్రియుడితో కలిసి పనికానిచ్చేసింది. కానీ 9 నెలల తర్వాత అసలు బండారం బయటపడటంతో అంతాకలిసి ఊచలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam) గొలుగొండ మండలం పాకలపాడు గ్రామానికి చెందిన రుత్తల సత్తిబాబుకు కొన్నేళ్ల క్రితం రామలక్ష్మితో పెళ్లైంది. ఐతే రామలక్ష్మికి అదే గ్రామానికి చెందిన సబ్బవరపు ఎర్రినాయుడుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.
ఐతే భార్య సాగిస్తున్న వ్యవహారం సత్తిబాబుకు తెలియడంతో తాగొచ్చి ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఐతే ప్రియుడితో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించిన రామలక్ష్మి భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ప్రియుడు ఎర్రినాయుడుతో కలిసి కుట్రపన్ని.. అదే గ్రామానికి చెందిన కర్రికృష్ణతో రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎర్రినాయుడు.. సత్తిబాబుకు తాగుడు, పేకాట ఆడే అలవాటుండటంతో గతేడాది ఆగస్టు 7న అతడికి ఫోన్ చేసి మాకవరపాలెంలో పేకాటడాతున్నారని వెళ్లామంటూ నమ్మబలికారు. కర్రి కష్ణ, ఎర్రినాయుడు ఓ బైక్ పై, సత్తిబాబు తన మోపెడ్ పై మాకవరపాలెం బయలుదెరారు.
మార్గం మధ్యలో ఏటిగైరంపేట వద్ద సత్తిబాబుతో పూటుగా మద్యం తాగించారు. అనంతరం సమీపంలోని తోటకు తీసుకెళ్లి కృష్ణ.. సత్తబాబు కాళ్లు పట్టుకోగా.. ఎర్రినాయుడు గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత డెడ్ బాడీని ఏలేరు కాలువలో పడేశారు. మోపెడ్ ను కూడా కాలువలోకి నెట్టారు.
సత్తిబాబు కనిపించకపోవడంతో అతడి తండ్రి దేముడు, అక్కడ పైడితల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఎవరిమీదా అనుమానం లేదని చెప్పడంతో కేసు దర్యాప్తు కష్టమైంది. ఐతే సత్తిబాబు భార్య రామలక్ష్మికి ఎర్రినాయుడుతో వివాహేతర సంబంధం ఉందని.. వాళ్లిద్దరూ కలిసి సత్తిబాబును హత్యచేసి ఉంటారని అతడి తండ్రి ఈ ఏడాది ఆగస్టు 19న గొలుగొండ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతుండగా.. ఎర్రినాయుడు కనిపించకుండా పోయాడు.
నెలరోజులకు పైగా అజ్ఞాతంలో ఉండి వీఆర్వో ఎదుట లొంగిపోయాడు. ఎర్రినాయుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు రామలక్ష్మి, ఆమె మేనత్త సన్యాసమ్మను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మరో నిందితుడు కర్రికృష్ణ గంజాయి కేసులోజైలులో ఉన్నాడు. ఎర్రినాయుడు చెప్పిన వివరాల ఆధారంగా ఎలేరు కాలువలో సత్తిబాబు మోపెడ్ ను స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.