WHY SOME ASTROLOGERS PREDICT WRONG ON THE ISSUE OF WHO WILL BECOME NEXT CM OF ANDHRA PRADESH NK
చంద్రబాబు సీఎం అవుతారన్న జ్యోతిష్యులు ఎవరు? వాళ్లెందుకు తప్పు చెప్పారు?
చంద్రబాబు, నరేంద్ర మోదీతో వైఎస్ జగన్
AP New CM YS Jagan : జగన్ మోహన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం... చంద్రబాబుది పుష్యమీ నక్షత్రం. ఐతే చంద్రబాబు సీఎం అవుతారన్న జ్యోతిష్యులు ఇప్పుడేమయ్యారు? ఎందుకు వారి అంచనా తప్పైంది?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బెట్టింగ్ రాయుళ్లలాగే... కొంత మంది జ్యోతిష్యులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారా? కొంతమంది చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని అంటే, మరికొందరు జగన్ సీఎం అవుతారని అంచనా వేశారు. ఇందుకోసం వాస్తుదోషాలు, గ్రహ బలాలు, ముహూర్తాలు, నక్షత్రాలు ఇలా అన్ని కోణాల్లోనూ ఏవేవో ఆలోచించి, ఎవరి అంచనాల లెక్కలు వారు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, జగన్ సీఎం అవుతారన్న జ్యోతిష్యుల మాట నెగ్గినట్లైంది. అదే సమయంలో... చంద్రబాబు సీఎం అవుతారని చెప్పిన జ్యోతిష్యులు ఇప్పుడు సైలెంటైపోయారనీ, వీలైనంతవరకూ ఈ టాపిక్ ఎత్తకుండా జాగ్రత్త పడుతున్నారనీ తెలిసింది. అసలు జగన్కి అనుకూలంగా చెప్పిందెవరు? చంద్రబాబుకి అనుకూలంగా చెప్పిందెవరు?
జగన్కు ఉన్న జాతకం ప్రకారం ఆయనే నెక్ట్స్ సీఎం అవుతారని చెప్పారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. జగన్ జాతకంలో ఏప్రిల్ 30 వరకూ శని మహర్ధశలో ఉంటుందని, ఆ తర్వాత బుధ మహర్దశ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. జగన్ ఆరుద్ర నక్షత్రం, కన్యాలగ్నంలో, మిథున రాశిలో జన్మించినందువల్ల... శక్తిమంతమైన బ్రహ్మయోగం, గజకేసరి యోగం ఆయన జాతకంలో ఉన్నాయని చెప్పారు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. ఆయన చెప్పినట్లే జగన్ ఏపీ సీఎం అయ్యారు.
వేణు స్వామి అనే మరో జ్యోతిష్యులు కూడా 2019లో జగన్ సీఏం అవుతారని అన్నారు. జగన్ జాతకంలో రాజయోగం ఉందని తెలిపారు. చంద్రబాబు జాతకంలో గురు గ్రహ ప్రభావం ఎక్కువ ఉండడంతో అధికారానికి దూరం కావచ్చని అన్నారు. జగన్ మోహాన్ రెడ్డిది ఆరుద్ర నక్షత్రం... చంద్రబాబుది పుష్యమీ నక్షత్రం కావడంతో రాహుకాలంలో వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ వల్ల చంద్రబాబుకి పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్నారు. జాతకం లెక్కల్లో చూసినా చంద్రబాబు... గెలుపు దగ్గరకు వెళ్లి ఓడిపోతారని అన్నారు. ఐతే లోక్సభ ఫలితాలు మాత్రం చంద్రబాబుకు కాస్త అనుకూలంగా ఉంటాయని అంచనా వేశారురు. వేణు స్వామి చెప్పిన దాంట్లో చంద్రబాబు ఓడిపోవడం జరిగింది గానీ, లోక్ సభ ఫలితాలు టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా రాలేదు.
ప్రముఖ జ్యోతిష్యులు కొమ్మినేని మల్లేశ్వరరావు సిద్ధాంతి ఏపీ ఎన్నికల ఫలితాలపై అందరికంటే ముందుగానే స్పందించారు. ఏపీలో మళ్లీ చంద్రబాబే అధికారం చేపడతారని అన్నారు. చంద్రబాబు ఇంటికి ఉన్న అద్భుతమైన వాస్తే ఆయనకు కలిసొస్తుందన్నారు కొమ్మినేని. హైదరాబాద్లో చంద్రబాబు ఉండే ఇంటికి అద్భుతమైన వాస్తు ఉందనీ అందుకే ఆయనే మళ్లీ సీఎం అవుతారని లెక్కలేశారు. అంతేకాదు... నారా లోకేష్ కూడా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరుతారని చెప్పారు.
ఈ కొమ్మినేని మల్లేశ్వరరావు సిద్ధాంతి చెప్పిన రెండు విషయాలూ తప్పే అయ్యాయి. చంద్రబాబు సీఎం కాలేదు, ఆయన కొడుకు నారా లోకేష్ కూడా ఎన్నికల్లో గెలవలేదు. మరి ఆయన ఏ లెక్కలేసుకొని ఈ అసంబద్ధ జ్యోతిష్యం చెప్పారన్నది అర్థంకాని విషయం. అసలు చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలో ఉంటుంటే... హైదరాబాద్లో ఇంటి వాస్తు ఆయనకు కలిసిరావడమేంటి? ఇదెక్కడి లింకో ఆయనే చెప్పాలంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబుకి అనుకూలంగా చెబితే, ఒకవేళ చంద్రబాబే సీఎం అయితే తనకు బాగా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఇలా చెప్పారా అని ప్రశ్నిస్తున్నారు వాళ్లు.
ఇలా ఎవరు సీఎం అవుతారనే అంశంపై జ్యోతిష్యులు ఎవరికి తోచినట్లు వారు చెప్పారు. ఫలితంగా కొందరి మాట రైటైతే, కొందరి వాక్కు రాంగైంది. రైటైన వారంతా ఇప్పుడు జగన్ గురించి తాము చెప్పిందే జరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. రాంగైన వారు మాత్రం అసలా టాపిక్కే ఎత్తకుండా సైలెంటవుతున్నారు. అసలీ జ్యోతిష్యాల్ని నమ్మాలా వద్దా అన్న ప్రశ్న... ప్రశ్నగానే మిగులుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.