AP Assembly Election 2019 : షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు ఇవాళ టీడీపీ ఈవీఎం టెక్నికల్ టీం వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ జరగాల్సి ఉంది. బట్... ఇక్కడే సీఈసీ ఓ మెలిక పెట్టింది. టీడీపీ పంపుతున్న టెక్నికల్ టీంలో హరి ప్రసాద్ ఉండటానికి వీల్లేదని అంది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్తో చర్చించేందుకు సిద్ధమని తెలిపింది. ఈవీఎంలో తప్పులు ఉండటం వల్లే ఈసీ భయపడుతోందని టీడీపీ అరోపించింది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని టీడీపీ టెక్నికల్ నిపుణుడు హరిప్రసాద్ ఆరోపించారు. 2010లో తనపై కేసుకు సంబంధించి ఛార్జిషీటే దాఖలు కాలేదని... అలాంటప్పుడు తనపై కేసు ఉందని ఈసీ చెప్పడం... అర్థరహితం అన్నారాయన. ఈసీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇలా మెలిక పెడుతోందని ఆరోపించారు.
వీలైతే హరిప్రసాద్తో కూడిన టీడీపీ టెక్నికల్ టీం ఇవాళ సీఈసీని కలుస్తుంది. లేదంటే... ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ లేఖ రాయాలని నిర్ణయించుకుంది.
ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా : ఈ ప్రశ్న హ్యాకర్లను అడిగితే సాధ్యమే అని అంటారు వాళ్లు. ఇంకా చెప్పాలంటే... ఈ ప్రపంచంలో హ్యాకింగ్కి సాధ్యం కాని సిస్టం లేదు. ప్రతీదీ కంప్యూటర్ల భాషతోనే పనిచేస్తాయి కాబట్టి... దేనినైనా డీకోడ్ చెయ్యగలరు హ్యాకర్లు. ఐతే, డీకోడ్ చెయ్యాలంటే... ఆయా సిస్టంలకు ఉండే ఐడీ, పాస్వర్డ్లను క్రాక్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు. ఇలాంటి సాఫ్ట్వేర్లను రష్యా హ్యాకర్లు ఎక్కువగా తయారుచేస్తున్నారు. ఏ సిస్టంకి సంబంధించిన పాస్ వర్డైనా... ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఐదు నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అంతే కాదు... ఆ సాఫ్ట్వేర్ని ఆయా సిస్టంలలో జొప్పించడం ద్వారా... మొత్తం సిస్టం పనితీరునే మార్చేయగలరు.
మొన్నటి (11న జరిగినవి) ఎన్నికల్ని రద్దు చెయ్యమని టీడీపీ కోరట్లేదు. వీవీప్యాట్లలోని 50 శాతం స్లిప్పులను కౌంటింగ్ చెయ్యాలని మాత్రమే కోరుతోంది. ఓటర్లు ఎవరికి ఓటు వేశారో, అదే గుర్తుకి ఓటు పడిందో లేదో తేలాలంటోంది టీడీపీ. ఈ విషయంలో అనుమానాలేవీ అక్కర్లేదంటున్న సీఈసీ... అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అభ్యంతరం చెబుతోంది. ఫలితంగా ఈ అంశం ఏపీ నుంచీ ఢిల్లీ వరకూ రాజకీయంగా రగులుతూ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Election Commission of India, EVM, Evm tampering, TDP, Vvpat