Setti Jagadeesh, News 18, Visakhaptnam
కుక్కపిల్ల..అగ్గిపుల్ల..సబ్బుబిళ్ల.. కోడిగుడ్డు కాదేదీ కళలకు అనర్హం అంటున్నాడు ఓ యువ కళాకారుడు. తనలోని సృజనాత్మతకు పదునుపెడుతూ కోడిగుడ్డుపై అద్భుతమైన కళాకండాలను తీర్చిదిద్దుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపట్నం (Visakhapatnam) కి చెందిన కళాకారుడు దుర్గా శంకర్... చెక్క, మట్టితో నే కాదు గుడ్డుతో కూడా అద్భుతం చేయొచ్చు అంటున్నారు. కోడి గుడ్డు.. బాతు గుడ్డు.. ఈము కోడి గుడ్డులతో కళ్లకు కట్టినట్టు మోదీ, జీసెస్, అల్లూరి, ట్రైన్, ఈగ వంటి మరెన్నో అద్భుతమైన కళాఖండాలు రూపొందించాడు. తన ప్రతిభతో చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. సమాజాన్ని మేల్కొల్పే ఎన్నో సందేశాత్మక చిత్రాలను గుడ్డుపై తీర్చిదిద్దడం శంకర్ ప్రత్యేకత.
అక్కయ్యపాలెం నందగిరి ప్రాంతానికి చెందిన శంకర్కి చిన్నతనం నుంచి చిత్రలేఖనం అంటే మక్కువ. వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఇంట్లో వాడి పారేసిన కోడి గుడ్డు పెంకులే ఆయనకు ఆయుధం. వాటితో అందమైన ఆకృతులను తయారు చేసేవారు. భారతదేశపటం, ప్రపంచ క్రికెట్ కప్, చేతి వాచ్, జోకర్ బొమ్మ, ద్విచక్ర వాహనం , ఈగ.. ఇలా ఎన్నో రూపాలు కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. కోడిగుడ్డుపై ఇప్పటికే వందకు పైగా కళాఖండాలను రూపొందించి పలువురు ప్రశంసలు, అవార్డులు పొందాడు. ఇటీవల శంకర్ రూపొందించిన రైలు బండి ఇంజన్ అందరి మనన్నలు అందుకుంది.
గుడ్డు పెంకులతో ఆర్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు..కాస్త అటు ఇటు అయ్యినా వెంటనే ఆ పెంకు పగిలిపోతుంది. ఎంతో జాగ్రత్తగా నిదానంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఆ గుడ్డుమీదనే అదిరిపోయే చిత్రాలను గీస్తున్నాడు.. ఆ గుడ్డుపెంకులతోనే వారెవా అనిపించే బొమ్మలను తీర్చిదిద్దుతున్నాడు.
సినిమా పరిశ్రమపై ఆసక్తికొద్దీ అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా కొంతకాలం పనిచేశారు. సంపాదన అంతంత మాత్రం ఉండటం మరోవైపు కుటుంబ పరిస్థితులు సహకరించక పోవడంతో పూర్తి స్థాయిలో సినీఇండస్ట్రీపై దృష్టి పెట్టలేకపోయాడు. తర్వాత వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో కొన్నాళ్లు పనిచేశాడు. అక్కడ విద్యార్థులకి పచ్చి కోడి గుడ్లు తాగడం అలవాటు. ఇలా కోడి గుడ్లు పగలకొట్టిన తర్వాత పెంకులు డస్ట్ బిన్లో వేసేవారు. రోజు కోడి గుడ్లు పగలగొడుతున్నప్పుడు ఒక ఆకారం రావడం గమనించిన శంకర్కు తన చిన్ననాటి అభిరుచికి కాస్త పదునుపెట్టాలనే ఆలోచన వచ్చింది.
అప్పటి నుండి వివిధ రూపాల్లో కోడి గుడ్లు, వాటి పెంకులతో కళాఖండాలు రూపొందించేవాడు. తన సృజనతో వాటికి అద్భుత రూపం ఇచ్చేవాడు. తేలు, రధం, ద్విచక్ర వాహనం, హెల్మెట్, జ్యూయలరీ సెట్, కారు…ఇలా ఒకటేమిటి అనేక కళాఖండాలను రూపొందించాడు. ఒక అంశాన్ని ఇస్తే చాలు దానికి తగ్గట్లుగా కోడిగుడ్డుపై ఆర్ట్ వేయడంలో శంకర్ సిద్ధ హస్తుడు.
కోడిగుడ్డుపై రాముడు, బుద్ధుడు, బాహుబలి, వైఎస్ఆర్, నృత్య కళాకారిణి..ఇలా ఎన్నో రకాల కళాకండాలను తీర్చిదిద్దాడు. అధిక వ్యయంతో కూడుకున్న పని కావడంతో ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే రామాయణం, జీసస్ జీవిత చరిత్ర , ఖురాన్ వంటి ఇతివృత్తాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తానని కళాకారుడు శంకర్ కోరుతున్నారు.
కోడిగుడ్డు మీద పెయింటింగ్లు మాత్రమే కాదు అదే గుడ్డు పెంకులతో అద్భుత కట్టడాలు నిర్మిస్తానని శంకర్ చెబుతున్నారు. ముఖ్యంగా కోడిగుడ్డు పెంకులతో శంకర్ తయారుచేసిన గణేనాథుడిని చూస్తే వారేవా అనాల్సిందే…! అంతేకాదు తాజ్ మహల్, ట్రైన్ ఇలా ఎలాంటి కట్టడమైన గుడ్డు పెంకులతోనే ఇట్టే నిర్మిస్తానని చెబుతున్నారు. ఫోన్ నెంబర్: 9396886952, శంకర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam