Setti Jagadeesh, News 18, Visakhapatnam
మహిళలు తమ జీవితంలో అనేక రూపాల్లో ప్రధాన భూమికను పోషిస్తున్నారు. తల్లి, చెల్లి, భార్య, కుమార్తె ఇలా అనేక పాత్రల్లో స్త్రీలు తమ కుటుంబంతో పాటు సమాజంతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. అన్ని రంగాలలోనూ ముందంజలో ఉంటూ ఎంత కష్టమైనా సరే సాధిస్తున్నారు. వ్యాపారం ఉద్యోగ రంగంలో మగవారితో పాటు సమానంగా సాధించడం జరుగుతుంది. మహిళలు ఏకంగా రైలును పూర్తిగా తమ సారథ్యంలో నడుపుతూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తున్నారు.
విశాఖపట్నం (Visakhapatnam) లో వాల్తేరు రైల్వే డివిజన్ (Waltair Railway Division) లో ఓ రైలును పూర్తిగా మహిళల సారథ్యంలోనే నడిపి ప్రశంసలు అందుకుంటున్నారు. మేనేజర్, లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలెట్, టీసీ, ఆర్పీఎఫ్ మహిళా సిబ్బందితో కూడిన విశాఖ-రాయగడ ( Vizag-Rayagada Train-08504) రైలుకు అధికారికంగా తూర్పు కోస్తా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ అధ్యక్షురాలు పారిజాత సత్పథీ పచ్చ జండా ఊపి ప్రారంభించారు.
గతంలో ముగ్గురు మహిళలు విశాఖ-రాయగడ మార్గంలో గూడ్స్ రైలును నడపేవారు. ఇప్పుడు లోకో పైలట్ సహానా కుమారి, అసిస్టెంట్ లోకో పైలట్ నాగమణి, రైలు మేనేజర్ ఎం. కల్యాణి, టీసీలు అంబిలి, అచ్చుతాంబ, సంతోషి, రాధ తదితరులతో విశాఖ-రాయగడ రైలు కొనసాగుతుంది. రైలును నడిపించిన మహిళా బృందాన్ని వాల్తేర్ డీఆర్ఎం అనూప్ సత్పథీ అభినందించారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కవితా గుప్తా, కార్యదర్శి ప్రియాంక శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Indian Railway, Local News, Visakhapatnam