P. Anand Mohan, Visakhapatnam, News18
ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ఎంతో నచ్చి మెచ్చి పెట్టిన కార్యక్రమం నాడు నేడు. ఇందులో ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించి.. వాటికి మంచి రూపు తేవడం.. తద్వారా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకి చక్కని విద్య అందించడం దీని లక్ష్యం. కానీ.. ఇప్పుడు ఇదే "నాడు నేడు" పేరుతో ప్రతిపక్ష టీడీపీ (TDP), జనసేన పార్టీ (Janasena Party) లు మరో కార్యక్రమం మొదలుపెట్టాయి. ఆ కార్యక్రమం కూడా విశాఖపట్నం కేంద్రంగానే జరుగుతోంది. అదేంటి.. ఇంకో నాడు నేడు.. అదీ విపక్షాలు చేస్తాయా..? అనేగా మీ ప్రశ్న. దీనికి ఆన్సర్ కూడా విశాఖలోని కొన్ని పర్యాటక ప్రదేశాలే. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖలో జరిగిన విధ్వంసం వివరాలు చెప్పడానికే ఆ కార్యక్రమం మొదలైందని చెబుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.
విశాఖ. సుందర తీరం. పర్యాటక స్వర్గ ధామం. సాగర తీరంలో అనేక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖకి మొదటి నుంచీ మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ లేని వనరేముంది.. అన్నీ ఉన్నాయి. అయితే ఇదే కొందరికి కోట్ల రూపాయిల్లా కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా భూములను ఆక్రమించడానికి ఇదే సమయం అయిపోయింది. అందరూ విశాఖలోనే ఏదో చేయాలన్న తపన పెరిగిపోవడంతో.. కొందరు అధికార బలంతో ఇక్కడ భూముల్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతుంది రిషి కొండ. ఋషికొండ అని పిలుచుకునే ఇప్పుడు ఈ ఆక్రమణలు.. కూల్చడాల కారణంగా కళా వీహీనంగా మారిపోయింది. గత ప్రభుత్వాలు ఏదో కడితే.. ఇప్పటి ప్రభుత్వాలు అవి కూలుస్తాయి. ఇలా నిర్మాణ, కూల్చివేతల కారణంగా పాడైపోయిన పర్యాటక ప్రాంతంగా రుషి కొండ మారిపోయింది.
ఏ మూహూర్తాన అమరావతి వద్దని.. మూడు రాజధానులు అంటూ ప్రకటన వచ్చిందో..? అప్పటి నుంచే విశాఖలో కూల్చివేతలు ఆక్రమణలు జోరందుకున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం నలుమూల నుంచీ.. ఇతర రాష్ట్రాల నుంచీ కూడా ఇక్కడికి వ్యాపారం చేద్దామని చాలా ముందే వచ్చారు. అయితే అలా వచ్చిన వారిలో భూముల మీద పెట్టుబడి పెట్టేవాళ్లే ఎక్కువయ్యారు. ఇంకో పక్క ప్రభుత్వ భూములు పై కన్నేసిన భూ మాఫియా కూడా ఎక్కువైంది. దీంతో ప్రభుత్వ స్థలాల పై ఎక్కువ ఆక్రమణలు.. కబ్జాలు పెరిగిపోయాయి.
రుషి కొండ ప్రాంతంలో ఒకప్పుడు ఏపీ టూరిజం సంబంధించిన భవనాలు ఉండేవి. హరిత రిసార్ట్స్ చాలా ప్రత్యేకమైనవిగా చెప్పాలి. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ పర్యాటక భవంతుల్ని కూల్చేసింది. తిరిగి సెవెన్స్ స్టార్ హొటల్ కడతామని చెబుతున్నారు. కొత్త నిర్మాణాలు సంగతి సరే. కానీ.. కూల్చివేతల కారణంగా రుషికొండ కళా విహీనంగా మారింది. ఇకప్పుడు.. పర్యాటక భవంతులతో కళకళలాడిన ఈ ఇదే ప్రాంతం ఇప్పుడు కళ తప్పింది. ఇప్పుడు ఎలాంటి నిర్మాణాలు లేకుండా కొండ తొలిచేసి.. పచ్చని చెట్లను కూడా తొలగించారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నేతలు కోర్టుల్ని ఆశ్రయించారు. అలాగే జనాల్లో కూడా నాడు నేడు అంటూ ఫొటోలు వేసి ప్రభుత్వ అధీనంలోని కొందరు పెద్దలపై ప్రచారం మొదలుపెట్టారు.
ఇక విశాఖ రుషికొండపై హరిత రిసార్టు స్థానంలో చేపట్టే నిర్మాణాల్లో విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి (వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి, విశాఖ కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, మైనింగ్ శాఖ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది.
కోస్టల్ రెగ్యులేషన్ జోన్కు విరుద్ధంగా విశాఖ జిల్లా, చినగదిలి మండలం, ఎండాడ గ్రామ పరిధిలోని సర్వే నం.19లో రుషికొండపై చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ చెందిన పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలు చేపడుతున్నారని, సముద్ర తీరాన ఉన్న కొండపై చెట్లను నరికి వేశారని వివరించారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. చూడాలి ఇక పై ఏం జరుగుతుందో..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Visakhapatnam