Wife and Husband: భార్యాభర్తలంటే ఒకటే మాట... ఒకటే బాట. ఇద్దరి శరీరాలు వేరైనా మనసులు ఒకటిగానే ఉంటాయి. అగ్నిసాక్షిగా ఒక్కటైన వారు కాటికి వెళ్లేవరకూ కలిసి కాపురం చేస్తారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటారు. కానీ ఓ జంట మాత్రం మోసాల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు చీటింగ్ (Cheating) చేయడంలో కూడా అంతే పక్కాగా ఉన్నారు. కలిసి కాపురం చేయడమే కాదు.. జనాల్ని గోదాట్లో ముంచి మరీ డబ్బులు సంపాదించడంలో ఇద్దరిదీ ఒకటే మాట. స్కెచ్ వేస్తే లక్షల్లో దండుకొని చెక్కేస్తారు. అంతేనా టూర్లు వేస్తూ టిక్ టాక్ లు చేస్తారు. వీళ్ల అన్యోన్యత చూసిన ప్రతి ఒక్కరూ ఈర్ష్యపడతారు.. కానీ వారు చేసిన మోసాలు మాత్రం అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశాయి.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) గోకవరంకు చెందిన మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రి దంపతులు కొన్నాళ్లుగా మోసాలు చేస్తున్నారు. విదేశాల్లోని మంచి యూనివర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామని చాలామంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు. అంతేకాదు సబ్సిడీ లోన్లు, ఇతర బ్యాంక్ లోన్లు ఇప్పిస్తామంటూ మరికొందరికి పంగనామాలు పెట్టారు. ఇలా ఉభయగోదావరి జిల్లాలో పలువురు దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశారు.
ఈ చీటింగ్ దంపతులపై తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి, గోకవరం, రాజమండ్రి ప్రకాష్ నగర్, బొమ్మూరు, తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గౌరీ శంకర్ అనే బాధితుడు గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్లుగా దంపతులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
టిక్ టాక్ లో హల్ చల్...
మోసాలు చేసి సంపాదించిన డబ్బును విలాసాల కోసం ఖర్చు చేయడం వీరికి అలవాటు. భార్యాభర్తలిద్దరూ టూర్లకు వెళ్లడం టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చేస్తుంటారు. వీరి టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్ల హైక్లాస్ మెయింటెనెన్స్, హడావిడితో పాటు తీయని మాటలకు పడిపోయిన బాధితులు వారికి లక్షల్లో ముట్టజెప్పి మోసపోయారు. ఈ దంపతులు గతంలో ఓ రాజకీయ పార్టీలో తిరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఈ దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎంతమందిని మోసం చేసిందీ..? ఎవరి వద్ద ఎంతెంత తీసుకున్నదీ..? ఆరా తీస్తున్నారు. వీరి బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. వీళ్లు గోదావరి జిల్లాల్లోనే మోసాలకు పాల్పడ్డారా..? లేక ఇతర ప్రాంతాల్లోనూ దందా నడిపించారా..? అనేదానిపై ఆరా తీస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cheating case, Couples, Crime news, East Godavari Dist