P. Anand Mohan, Visakhapatnam, News18
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రయాణం కాస్త ఇబ్బంది అవుతుంది. నిత్యం ఆటో, ట్యాక్సీ, బస్సుల వంటి వాటిని ఆశ్రయించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సమయం చాలా వృథా అవుతుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పర్యాటకపరంగా విశాఖపట్నం (Visakhapatnam) ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరం. సాంస్కృతిక, చారిత్రక నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. కుటుంబసమేతంగా సెలవులు గడిపేందుకు సరైన పర్యాటక ప్రదేశమిది. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులకు రైల్వే శాఖ (Indian Railways) సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. నగర సందర్శనకు వచ్చేవారి కోసం బైక్ లు కార్లు, అద్దెకు తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు ఇప్పటికే పలు సదుపాయాలను కల్పించారు. అయితే స్టేషన్కు చేరుకున్న యాత్రికులు.. నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్లు, ఇతర వాహనాలను ఆశ్రయించే విధానాన్ని పరిశీలించిన అధికారులు.. తామే అద్దెకు వాహన సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కార్యాచరణ అమలు చేశారు.
విశాఖ అందాలను తిలకించేందుకు విజయవాడ, హైదరాబాద్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని రామకృష్ణ, రుషికొండ, యారాడ బీచ్లు, కైలాసగిరి, టీయూ-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, జూపార్క్ సహా సింహాచలం, తొట్లకుండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఆంధ్రా ఊటీ అరకుతో పాటు లంబసింగి వంజంగి లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పర్యాటకుల అవసరాలను గ్రహించిన రైల్వే శాఖ ‘మిస్టర్ బైక్స్’ పేరిట బైక్, కార్ సర్వీసులను ఏర్పాటు చేసింది. విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద ఎలక్ట్రికల్ పెట్రోలు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాటి రకం మేరకు ధరలు నిర్ణయించారు.
పెట్రోల్ తో నడిచే స్కూటీ తరహా వాహనానికి రోజుకు రూ.500, బైక్ లకు రూ.600-1200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించి అద్దెకు వాహనాన్ని పొందవచ్చు. నచ్చిన వాహనం కోసం వారం రోజుల ముందు ఆన్ లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
యువతకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటకుల కోసం రెండు వందలకుపైగా ద్విచక్ర వాహనాలు, పదుల సంఖ్యలో కార్లు అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు ఇచ్చే వాహనాలకు.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఈ సదుపాయం ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bikes, India Railways, Visakhapatnam