P. Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మూడు రాజధానుల బిల్లు రద్దు ( AP 3 Capitals Bill) ప్రభావం మిగతా జిల్లాల్లో ఎల్లా ఉన్నా.. విశాఖపట్నం (Visakhapatnam) లో మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఓ రంగానికి ఈ "రద్దు" ఉపసంహరణ ప్రకటన మింగుడుపడటం లేదు. నిద్రరావటం లేదు. ఇప్పటికే కోటాను కోట్లు పెట్టుబడి పెట్టేసిన ఆ రంగానికి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎక్కడెక్కడి నుంచో విశాఖకు పరుగెట్టుకుంటూ వచ్చిన కొందరు బడాబాబులకు ఈ మూడు రాజధానుల బిల్లు రద్దు నిద్ర లేకుండా చేసింది. ఇక్కడ వేల ఎకరాలు కొనేసి.. ఇతరత్రా మార్గాల్లో గుప్పిట్లో పెట్టుకున్న వారందరికీ సోమవారం నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన కునుకులేకుండా చేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక వ్యాపారులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.
రియల్ ఎస్టేట్. ఎకరాల్లో కొని గజాల్లో.. గజాల్లో కొని ఇంకెన్నో రకాలుగా అమ్మేయడం. విశాఖ లాంటి డెవలపింగ్ ఏరియాల్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలానే ఉన్నాయి. చిన్న స్థాయి బిల్డర్ల నుంచి పెద్ద పెద్ద బిల్డర్లు ఇక్కడ ఉన్నారు. విశాఖ ఎంపీ కూడా ఒకరకంగా రియల్ ఎస్టేట్ దిగ్గజమే. ఇక పాయింట్ కి వస్తే.. ఇప్పుడు ఈ బిల్డర్లకే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ వణికించేస్తోంది. సీఎం "క్లియర్" గా చెప్పేయడంతో రియల్ ఎస్టేట్ బాబులకు ఇప్పుడు ఒళ్లు వణుకుతోంది. ఇప్పటికే కోటాను కోట్లు పెట్టుబడి పెట్టేసిన రియల్ బాబులకు ఇది పెద్ద దెబ్బ.
విశాఖలోని అటు అగనంపూడి నుంచీ ఇటు భీమిలీ.. ఇటు బీచ్ రోడ్డు నుంచీ అటు పెందుర్తి వరకూ అన్ని చోట్లా రియల్ బాబులు గట్టిగానే భూములు కొనేశారు. కొందరు రాజకీయ నేతలు కూడా ఇదే అదనుగా భూములు కొనేసుకుని.. తమ "కింద" పెట్టేసుకున్నారు. విశాఖ బోర్డర్ దాటేసి కూడా భూములు కొన్నారు. అటు విజయనగరం జిల్లా భోగాపురం, కొత్తవలస మండలాల్లో కూడా పక్కనే విశాఖ అంటూ ఊదరగొట్టారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అని.. విశాఖ రాజధాని అని రంగుల లోకం చూపించేశారు. రాజధాని వస్తే ఇంకేముందీ.. అన్ని ఇక్కడికే వచ్చేస్తాయని అరచేతిలోనే వైకుంఠం చూపించేశారు. ఎవరో ఒకరిద్దరు తప్ప.. దాదాపు తొంభై శాతం మంది రియల్ బాబులు ఇదే ప్లాన్ ఫాలో అయ్యారు. కానీ.. సీఎం బిల్లు ఉపసంహరణతో వీరి ఆశలన్నీ.. ఆవిరయ్యాయి.
ఒకప్పుడు విశాఖ నడిబొడ్డులో గజం భూమి కొనాలంటే లక్షలోపు ఉండేది. ఇప్పుడు అదే విశాఖ సిటీ పరిధిలో అంటూ.. సీతమ్మధార, ఇటు ఆర్టీసీ కాంప్లెక్స్, మురళీ నగర్ వరకూ గజం లక్షకి దొరకట్లేదు. అంటే ఒక సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలని భావించి.. వందగజాలు తీసుకోవాలంటే విశాఖలో ఇప్పుడు కనీసం కోటిశ్వరుడు అయిఉండాలి. అదీ కోటి రూపాయలు భూమికే పెట్టాలి. అంటే ఇల్లు కట్టడానికి మిగతావన్నీ తాకట్టు పెట్టేయాలి. స్క్వేర్ యార్డు నుంచీ స్క్వేర్ ఫీట్ లెక్కల్లో అమ్మేస్తున్నారు కాబట్టి బిల్డర్లు రేట్లు గట్టిగానే పెంచారు. ఏంటి బాబు ఈ రేట్టు అంటే సిమెంట్, ఇసుక, ఇటుక, ఐరన్ తక్కువ ఉన్నాయా..? అంటూ మార్కెట్ వైపు చేయి చూపిస్తున్నారు. గతంలో స్క్వేర్ ఫీట్ లెక్క నాలుగువేల లోపే ఉన్న విశాఖలో ఇప్పుడు దుర్భిణి వేసి వెతికినా.. ఇప్పుడు ఎనిమిదివేలకు తక్కువ లేదు. నాలుగువేల రూపాయల రేటు కావాలంటే విశాఖ సిటీ బార్డర్ దాటేయాల్సిందే.
ఇలాంటి పరిస్థితిలో రాజధాని లేదంటే.. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల గతేంకాను..? ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలు కొనేసి.. బిల్డింగ్ లు కట్టేద్దామని అంతా రెడీ చేసుకున్నారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. విశాఖలోని భీమిలీ, ఆనందపురం, మధురవాడ, ఎండాడతో పాటు.. ఇటు గాజువాక, అగనంపూడి, లంకెలపాలెం వైపు.. అటు పెందుర్తి, చినముషిడివాడ, సుజాతనగర్ వైపు పెద్ద ఎత్తున భూములు సమీకరించుకున్నారు.
రేపో మాపో జగన్ ఇక్కడికి వచ్చి "పరిపాలన" చేస్తారనుకుంటే ఈ దెబ్బ వేశారేంటని.. ఇప్పటికే కొందరు పెద్ద బిల్డర్ల లోలోపల కుమిలిపోతున్నారు. అందులోనూ సీఎం ప్రకటనలో విశాఖ పై ప్రేమ కనిపిస్తోంది తప్ప.. ఇక్కడికి రాజధాని పక్కాగా వస్తుందన్న పూర్తి స్థాయి నమ్మకాలు మాత్రం లేవని వైసీపీలో మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా.. "బిల్లు"తో చాలా మంది రియల్ బాబులు "గొల్లు"మంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap capital, Real estate, Visakhapatnam