Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
ఉత్తరాంధ్రలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి (Anakapalli) నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రూ.6.5 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేయడానికి చర్యలు చేపడుతున్నారు. తొలి దశలో రూ.3 కోట్లతో అంతరాలయం, గర్భాలయం, అనివేటి మండపం నిర్మిస్తారు. ఇవన్నీ పూర్తిగా రాతికట్టుతోనే చేపడతారు. కాణిపాకం వినాయక ఆలయం, తలుపులమ్మలోవ, రామతీర్థాలు ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టిన శ్రీధర్రెడ్డి అనే కాంట్రాక్టర్తో టెండర్ అగ్రిమెంట్ అయినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక రెండో దశలో రూ.3.5 కోట్లతో ఆలయ ప్రాకార మండపంతోపాటు ప్రస్తుతం ఆలయానికి తూర్పు దిశలో ఉన్న రాజగోపురం మాదిరిగా ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో మూడంతస్థులతో రాజగోపురాలను నిర్మిస్తారు.
ప్రస్తుతం 14.5 అడుగులు ఉన్న గర్భాలయాన్ని అదే స్థానంలో కొత్తగా నిర్మిస్తారు. ఐదు అడుగుల వెడల్పు ఉన్న అంతరాలయాన్ని 12.5 అడుగులకు విస్తరిస్తారు. 14 అడుగులు ఉన్న అనివేటి మండపాన్ని 35 అడుగులకు పెంచుతారు. ప్రస్తుతం ఆలయ నిధులు సుమారు రూ.5.5 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీల రూపంలో ఉన్నాయని, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు నుంచి రూ.3 కోట్లు ఇవ్వడానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subba Reddy) ఇటీవల అనకాపల్లి వచ్చినప్పుడు హామీ ఇచ్చారని ఆలయ ఈవో బండారు ప్రసాద్ చెప్పారు. వచ్చే ఏడాది మార్చి/ ఏప్రిల్ నాటికి (నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర) ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు వచ్చే నెల 8వ తేదీన శంకుస్థాపన చేయాలని దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో భూమి పూజ కార్యక్రమాలు జరుగుతాయి. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరవుతారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Visakhapatnam