Setti Jagadeesh, News18, Visakhapatnam.
Vizag Beach: ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. అయితే సాధారణంగా వానాకాలం వచ్చేసిందంటే చాలు.. పర్యాటకులు విశాఖ (Visakha), విశాఖ మన్యం (Visakha Agency) వైపు విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటారు. గత రెండు, మూడు రోజులు నుండి కురుస్తున్న వర్షాలకు విశాఖ సాగర తీరాన కెరటాలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి. వానాకాలంలో విశాఖ సాగరతీరం చూసేందుకు చాలా మనోహరంగా ఉంటుంది. పైన నల్లటి మేఘాల నడుమ సాగరతీరంలో జలకాలాడాలని చాలామంది అనుకుంటారు. సరదాగా పర్యాటకులు (Tourists) సాయంత్ర సమయంలో సముద్ర తీరానికి వెళ్తారు. దీంతో నగరవాసులు, పర్యాటకులతో బీచ్ సందడిగా ఉంటుంది. అలల అందాన్ని ఆస్వాదించడానికి కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో అలలు.. వాటితో పాటు సముద్రంలోకి తీసుకుపోతాయి. అలా మునిగిపోయిన వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. అయితే జీవీఎంసీ(GVMC) అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి పర్యాటకులను ముందుగా అరెల్ట్ చేస్తున్నారు.
మిగతా పర్యాటక ప్రాంతాల్లో బీచ్లతో పోల్చుకుంటే విశాఖలోని ఆర్కే బీచ్ (RK beach) దగ్గర పరిస్థతి భిన్నంగా ఉంటుంది. కేవలం పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంటుంది. ఆర్కే బీచ్కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు అలాఅలా పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది.
పర్యాటక ప్రేమికులు.. విశాఖ వచ్చి.. సముద్ర తీరాన సందడి చేయాలని అనుకుంటారు. కానీ, అందర్నీ ఒకటే భయం వెంటాడుతూ ఉంటుంది. బీచ్లో అలల్లో తేలియాడుతూ ఎంజాయ్ చేయాలని అంతా ఆనందపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో రాకాసి అలలు ఎన్నో కుటుంబాల్లో పెను విషాదం నింపుతున్న సంఘటనలు చూశాం.. అందుకే కొందరు బీచ్లకు వెళ్లాలి అంటేనే భయపడతారు.
ఇదీ చదవండి : ఆమె లేని నేను లేను.. సారీ నాన్నా.. క్షమించండి అంటూ సూసైడ్ లేఖ.. ఏం జరిగిందంటే?
తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు.. విశాఖ జీవీఎంసీ అధికారులు ప్రమాదకర ప్రదేశాల్లో నిషేధం బోర్డులు పెట్టారు. విశాఖ నగర పరిధిలోని అన్ని బీచ్పాయింట్లలో ఉండే లైఫ్గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అప్పుడప్పుడు అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యు వాతపడుతున్నారు.
అందుకే విశాఖ బీచుల్లో ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పర్యాటకులు ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నారు అని అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఉన్న వైపు వెళ్లి స్నానాలు చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Local News, Vizag