Vizag IT Hub: విశాఖ (Visakha) కు మంచి రోజులు వచ్చాయా.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు అడుగు పెట్టేందుకు వడివడిగా అడుగులేస్తోంది. ఇన్ఫోసిస్ వస్తే.. మిగతా కంపెనీలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది..? ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ (Hyderabad) ఐటీ కంపెనీలకు కేరాఫ్. అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకు సురక్షిత స్థలంగా భావిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖపై దిగ్గజ కంపెనీల కన్నుపడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ (Infosys)రెడీ అయ్యింది. తర్వాత హెచ్.సీ.ఎల్ (HCL). సాగరతీరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. మొన్న ఆదానీ డేటా సెంటర్.. నిన్న ఇన్ఫోసిస్.. రేపు హెచ్.సి.ఎల్.. ఇలా పెద్ద పెద్ద కంపెనీల ఫోకస్ వైజాగ్ పై పడింది. టైర్–2 నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడంమే దీనికి ప్రధాన కారణం. ఈ కంపెనీల కార్యకలాపాలు కొంతమేర ప్రారంభమైనా.. ఇంకా మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది.
భవిష్యత్తులో బహుళ జాతి ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించనుంచి ఇది ప్లగ్ అండ్ ప్లే లో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి.
విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఓ భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి : బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ పెరిగిందా..? ప్రధాని సభకు పవన్ డుమ్మా.. కారణం అదే అంటున్న బీజేపీ నేతలు
ప్రస్తుతానికి అందులోనే పని ప్రారంభమైనా.. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సొంత భవనం సమకూర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. ప్రస్తానికి వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా సొంత స్థలం వచ్చిన తరువాత.. 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచేయోచనలో ఉన్నట్టు సమాచారం.
మరోవైపు ఇన్ఫోసిస్తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకురావడంతో మంత్రి అమర్నాథ్ విశాఖకు పలు కంపెనీలు వచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. దీనికోసం 14,634 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని ఐటీ నిపుణుల అంచనా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag