Setti Jagadesh, News 18, Vizag
Vizag Drug Mafia: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్ సరఫరా రోజు రోజుకూ భయపెడుతోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతమైన విశాఖపట్నం ((Visakhapatnam)) లో ఈ దందా కొత్త దారులు తొక్కుతోంది. దేశంలో ఏ మూల డ్రగ్స్ మాఫియా పట్టుబడినా ఆ మూలులు.. విశాఖ నుంచే ఉంటున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వంటి నిషేదిత మత్తు పదార్ధాల అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోతుంది. యువతను టార్గెట్గా చేసుకుని కొందరు వ్యక్తులు ఈ మత్తు దందాలు సాగిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల సాగర తీరం కేంద్రంగా గంజాయి, డ్రగ్స్ (Drugs) దందా కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్, గంజాయి దందా కొనసాగుతుంది. ఇందులో లావాదేవీల కోసం నిందితులు క్రిప్టో కరెన్సీ, యూపీఐ పేమెంట్స్, హవాలా పద్దతుల ద్వారా నగదు బదిలీ జరుపుతున్నట్టు.. గుర్తించారు. అందుకోసం నిందితులు డార్క్ వెబ్ ను వేదికగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో ఐదుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. పక్కా సమాచారం మేరకు యాంటీ నార్కోటిక్ సెల్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన బృందాలు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. నిందితులు రవికుమార్, వాసుదేవా కాటయ్య, మోజేష్, యాద కిషోర్, మర్రే సందీప్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా కీలక నిందితుడు దీలిప్ను అరెస్ట్ చెయ్యాల్సి ఉందని అన్నారు. నిందితుల నుంచి 50 ఎల్.ఎస్.డి బ్లాట్స్, 4.4 గ్రాముల ఎండిఎంఎ పౌడర్, 5 మొబైల్ ఫోన్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు.
ఇదీ చదవండి : ఢిల్లీలో బాబు వంగి వంగి దండాలు పెట్టారంటూ ట్వీట్.. సైబర్ సెల్ కు ఫిర్యాదు.. ఎందుకంటే?
ముఠాలో పాంగి రవికుమార్ ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇతను విశాఖ నుంచి గంజాయి గోవా తరలించి అక్కడ డ్రగ్స్ ముఠాకు అందించేవాడని. అందుకు బదులుగా ఆ ముఠా నుంచి డ్రగ్స్ ఇక్కడకు తీసుకువచ్చేవాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ మత్తు దందా మొత్తం... వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ద్వారా గ్రూపులను ఏర్పాటు చేసుకొని డార్క్ వెబ్సైట్స్ ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీ, యుపిఐ పెమెంట్స్ చేస్తుండగా, ఈ వ్యవహారమంతా ఆన్లైన్లో జరుగుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సీపీ సీహెచ్ శ్రీకాంత్ వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై నిఘావర్గాలు జరిపిన లోతైన విచారణలో...ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి : నేటి నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు..? ప్రత్యేకత ఏంటి? ఎందుకు నిర్వహిస్తారు..?
ఒక కేసు మరో కేసుకు లింక్ అవుతూ.. జాతీయ స్థాయిలో పెద్ద నెట్వర్కే ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇతర నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సీపీ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం అరెస్టైన వారిలో హైదరాబాదులో ఉంటూ ట్రిపుల్ ఐటీలో నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నాడు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన మరో 11 మంది ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Drugs case, Local News, Visakhapatnam, Vizag