Neelima Eaty, News18, Visakhapatnam
Vizag: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని బెస్ట్ టూరిస్ట్ నగరం ఏది అంటే .. ముందుగా చెప్పుకోవాల్సింది విశాఖపట్నం (Visakhapatnam) గురించే.. బీచ్ సిటీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ, విదేశీ పర్యాటకుల చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఇక్కడ ఉన్న సహజమైన ఇసుక బీచ్లో చల్లని సాయంత్రం వేళ సరదాగా గడపడానికి నగరవాసులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దేశంలోనే కొన్ని అందమైన బీచ్లు ఉన్న నగరాల్లో విశాఖ ఒకటి. అందుకే దేశం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది విశాఖ నగరం. అలాంటి బీచ్ లు ఎన్నో వైజాగ్ (Vizag)లో ఉన్నా.. నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన రుషికొండ బీచ్ మరింత ప్రత్యేకమైంది.
సాయంకాలం, సాగరతీరం రుషికొండ వ్యూ పాయింట్:
రుషికొండ బీచ్ బంగాళాఖాతంలోని బంగారు ఇసుక, చక్కనైన అలలకు ప్రసిద్ధి చెందింది. పచ్చని కొండ పక్కనే రుషికొండ బీచ్ ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది. విశాఖ నగరం పరిధిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ చూడదగిన ప్రదేశం రుషికొండ బీచ్. విశాలమైన బంగారు ఇసుక, స్ఫటికంలాంటి స్వచ్ఛమైన నీరు, పరిసరాలలో పచ్చని మొక్కలు, రుషికొండ బీచ్ ఖచ్చితంగా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి సముద్రంలో వాటర్ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయడంతో పాటు బీచ్లో దొరికే చిరుతిండి ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తుంటారు. ఈ బీచ్ వాతావరణంలోని ప్రశాంతత, వెచ్చదనం మధ్య కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం అనేది ఒక చక్కటి అనుభవం.
బీచ్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే:
పోర్ట్ సిటీలోని ఈ అందమైన బీచ్ని సందర్శించకుండా వైజాగ్ పర్యటన అసంపూర్తిగా ఉంటుంది. సాయంత్రం వేళ తినడానికి స్ట్రీట్ ఫుడ్, వేడి వేడి చాయ్, చాట్ వంటివి కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరికే ఫాస్ట్ ఫుడ్ తింటూ స్నేహితులతో పిచ్చాపాటి చేస్తుంటే సమయం ఇట్టే గడిచిపోతుంది. రుషికొండ వ్యూ పాయింట్ చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా వెలిశాయి. సాయంత్రం వేళ బీచ్ని చూసేందుకు వచ్చే పర్యాటకులతో ఇక్కడ తమ వ్యాపారం బాగా సాగుతుందని వీధి వ్యాపారులు అంటున్నారు. దక్షిణ భారతదేశంలోని వర్జిన్ బీచ్లలో ఒకటిగా పేరుగాంచిన రుషికొండ బీచ్ వైజాగ్లోని అత్యుత్తమ బీచ్లలో ఒకటి. సాయంత్రం సమయంలో, ఈ బీచ్ చుట్టూ ప్రకృతి ప్రేమికులు, సాహస ఔత్సాహికులు చల్లని గాలులతో బీచ్ యొక్క సుందర దృశ్యాల మధ్య కొన్ని అందమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు.
రుషికొండ బీచ్ వ్యూ పాయింట్ చేరుకోవడం ఎలా?
విశాఖ నగరానికి సమీపంలో ఉన్న ఈ రుషికొండ బీచ్ వ్యూ పాయింట్ చేరుకోవాలంటే విశాఖ నగరంలో 900K బస్సు ఎక్కాలి ( రైల్వే స్టేషన్ నుండి భీమిలి). సొంత వాహనాలప వచ్చే వారు నగరంలోని ఆర్కే బీచ్ వెంబడి రోడ్డుపై ఉత్తరముఖంగా ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Best tourist places, Local News, Travel, Vizag