P.Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అందమైన పర్యాటక ప్రాంతాలు (Tourist Places in Andhra Pradesh) చాలానే ఉన్నాయి. అందమైన బీచ్ లు, పచ్చనైన వనాలు, నదీపరివాహక ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. అందులో అతి ముఖ్యమైన పర్యాటక ప్రాంతం పాపికొండలు. ఐతే కొంతకాలంగా పాపికొండలు యాత్ర (Papikondalu Tour) నిలిచిపోయింది. ఐతే పాపికొండల నడుమ గోదావరి నదిలో బోటు షికారు (Boating in Godavari River) కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈనెల 31 నుంచి బోటు షికారు ప్రారంభించే యోచనలో అధికారులు ఉన్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే పోచవరం నుంచి 12 బోట్లకు, పోలవరం నుంచి 6 బోట్లకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని బోట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకూ తమ బోట్లకు అనుమతి తెచ్చుకోవడానికి తంటాలు పడిన ప్రైవేట్ బోటు నిర్వాహకులు ఇవాళ చార్జీలు పెంచమని కోరుతున్నారు. ఈవారంలో కొత్త రేట్లు అమలులోకి వచ్చే అవకాశముంది.
గతంలో పెద్దలకు రూ.750 వరకూ తీసుకునేవారు. రాజమహేంద్రవరం నుంచి తీసుకుని వెళ్లి బోటు ఎక్కించి భోజనం, స్నాక్స్ పెట్టి సాయంకాలం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం పోలవరం ఎగువ కాఫర్ పూర్తి కావడంతో ఇక బోటింగ్ గండిపోచమ్మ గుడి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములు వరదలో మునిగిపోవడంతో వాటిని వేరే ప్రాంతాలకు తరలించారు. కొత్త రేట్లతో ఈ నెలాఖరు నుంచి బోటు షికారు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టూరిజం బోట్లతోపాటు, ప్రైవేట్ బోట్లు కూడా షికారు చేయనున్నాయి. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల బోటు యాత్ర ఆగిపోయిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ల తర్వాత ఈ బోటు షికారు ప్రారంభం కానుంది. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల పాపికొండలలో గతంలో కంటే గోదారి లోతు పెరిగింది.
ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ బోటు యాత్ర ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. కంట్రోలు రూమ్లు ఏర్పాటు చేసినప్పటికీ పాపికొండలలో సిగ్నల్స్ లేనందున అక్కడి సమాచారం అందే అవకాశాలు తక్కువే. గతంలో రూపొందించిన నిబంధనలు పాటిస్తూ బోటు షికారు మొదలుపెడితే మంచిది. లైసెన్స్ ఉన్న బోట్లకు అనుమతి ఇవ్వాలని, డ్రైవర్లకు శిక్షణ ఉండాలని, అంతా లైఫ్ జాకెట్లు ధరించాలని, రెండు ఇంజన్లు ఉం డాలని, గజఈతగాళ్లు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అంతేకాక యాత్రికులు బోటులోకి ఎక్కడానికి దిగడానికి గోదావరి ఒడ్డున సరైన ఏర్పాట్లు కూడా ఉండాలని కోరుతున్నారు.
బోటు షికారు వల్ల మళ్లీ వీటి మీద ఆధారపడిన వారికి పని దొరుకుతుంది. లాంచీలను పూర్తిగా నిషేధించి బోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత పాపికొండలు, పేరంటాలపల్లి విహారయాత్రకు గ్రీన్సిగ్నల్ వచ్చిందని, ఈనెలాఖరు నుంచి విహార యాత్ర ప్రారంభమవుతుందని బోట్ నిర్వాహకులు తెలిపారు. బోట్లు నిలిచిపోవడంతో చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయన్నారు. ఏమైనా విహార యాత్రకు అనుమతులు ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నారు. గిరిజన, గిరిజనేతరులకు సంబంధించిన 12 బోట్లకు మాత్రమే అనుమతులు వచ్చాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap tourism, Godavari river