యువతీయువకుల మధ్య ప్రేమ (Love Marriage)చిగురించడం సర్వసాధారణం. కానీ దానిని పెళ్లి వరకు తీసుకెళ్లే జంటలు కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్నిసార్లు అబ్బాయి పెళ్లికి నిరాకరిస్తే.. మరికొన్నిసార్లు అమ్మాయిలు పెద్దలు చూసిన సంబంధానికి తలవంచుకోవాల్సి వస్తోంది. మరికొన్ని ఘటల్లో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఒక్కటవుతుంటారు. కాని ఓచోట మాత్రం తమ ఏడేళ్ల ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు నాన్చుతున్న ప్రియుడ్ని.. ఓ యువతి ఎట్టకేలకు తనవాడిని చేసుకుంది. పోలీసులను, స్థానికులను పరుగులు పెట్టించినా తాను అనుకున్నది సాధించగలిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డు బెత్లహంపేటకు చెందిన పెట్టేల కేశవాణి అనే యువతి.. గాంధీనగర్ కు చెందిన యడ్ల భాస్కర్ రావు అనే యువకుడు గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఐతే కేశవాణి పెళ్లి మాట ఎత్తేసరకి దాటవేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండే పెళ్లికి నిరాకరిస్తుండటంతో యువతి బంధువులు రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెబుతానని భాస్కరరావు కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా స్పందన లేకపోవడంతో యువతి కీలక నిర్ణయం తీసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కింది.
పెళ్లికి ఒప్పుకోకుంటే దూకేస్తానని అక్కడే కూర్చుంది. దీంతో బంధువులు, స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఒప్పించి కిందకు దించారు. పాలకొల్లు సీఐ ఆంజనేయులు.., భాస్కరరావు, అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెళ్లికి ఒప్పుకున్నారు. అంతేకాదు పోలీసులు చొరవ తీసుకొని స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రేమికులిద్దరికీ దండలు మార్పించారు. ఏడాదిలోపు పెళ్లి చేసుకునేలా పోలీసుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విశాఖపట్నంలోని ఆరిలోవకు చెందిన భార్గవి అనే యువతి.. తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువతిని స్టేషన్ కు తీసుకెళ్లి రక్షణ కల్పించారు. యువతి చేసిన పనికి కొన్నిగంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఐతే ఆ సమయంలో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని చెప్పిన భార్గవి.. ఆ తర్వాతి రోజే మహిళా సంఘాల సాయంతో సింహాచలం ఆలయంలో తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది.
ఐతే తల్లిదండ్రులు తాను ఎంతచెప్పినా వినకుండా తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయాలని చూశారని భార్గవి ఆరోపించింది. తల్లిదండ్రులు తన జోలికి రావొద్దని.. తన బ్రతుకేదో తాను బ్రతుకుతానని స్పష్టం చేసింది. మరోవైపు ఇలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పి ఉండాల్సిందని.. పీటల వరకు వచ్చిన తర్వాత బాంబు పేల్చడం సరికాదని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Love marriage, West Godavari