Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు అతిముఖ్యమైన నగరం విజయవాడ (Vijayawada). దుర్గమ్మ పాదాలచెంతనున్న విజయవాడ ప్రస్తుతం రాష్ట్ర రాజధానిగా ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడే ఉంది. నగరంలోని ప్రధాన మార్గాలన్నీ గుంతలమయమే. ఎటు చూసిన లోతైన గోతులు, గుంటలు, ప్రాకారం లేని మ్యాన్ హోల్ మూతలుతో వాహనదారులు సతమతమవుతున్నారు. అటు సొరంగమార్గం మొదలు, చిట్టి నగర్, కాళేశ్వరరావు మార్కెట్, మొఘల్రాజపురం, సూర్యరావుపేట, ఫైవ్ నంబర్ రోడ్డు, సత్యనారాయణపురం , ఏలూరు రోడ్డుతో సహా ఎటు చూసినా లోతైన గోతులే. క్రమ బద్ధంగా లేని మ్యాన్ హోల్ మూతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు.
రాజధానికి అత్యంత చేరువలో ఉన్న ఈ నగరానికి అనేక మంది విఐపిలతో పాటు లక్షల మంది వాహనదారాలు వ్యాపారం, ఉద్యోగాలు, ఇతర పనుల కోసం విధి నిర్వహణ కోసం వచ్చి వెళ్తుంటారు. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా రోడ్లు మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. ఇక వేసవిలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నగరంలోని రోడ్లు మరీ అధ్వాన్నంగా మారాయని నగరవాసులంటున్నారు.
వన్ టౌన్కు వెళ్లాలంటే కత్తి మీద సామే
ఇక వన్ టౌన్ విషయానికి వస్తే బెజవాడతో పాటు సమీప ప్రాంతాలకు, వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి. ఆ ప్రాంతానికి వెళ్ళడం అంటే కత్తి మీద సామేనని చెప్పాలి. మాజీ మంత్రి నివాసానికి అత్యంతచేరువలో 5 నెలల క్రితం మొదలు పెట్టిన రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనదారుల అవస్థలు అన్ని ఇన్నీ కావు. ప్రతి రోజు గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో ఇరుకునిఇంటికి వెళ్ళడం అలవాటైపోయిందని… దానికి తోడు నగరంలో ఈ గుంతలు రోడ్లు తమను మరింత ఇబ్బంది పెడుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. అసలే ఇరుకురోడ్లు.. అందులో అడుగడుగునా గుంతలు.. ఈ రోడ్లలో భారీ వాహనాలు వస్తుండటంతో మరింత ఇబ్బందిగా ఉంటుందని వాహనదారులు మండిపడుతున్నారు.
మహిళలు, వృద్ధులు పదిహేను అడుగులు ఉన్న ఈ రోడ్లు దాటాలంటే తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇదిగోఅదిగో అంటు రోడ్డు విస్తరణ పూర్తి అవుతుందని చెబుతున్నారే కాని..అవి పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఏమరుపాటుగా ఉంటే అంతే సంగతి!
ఇక మొగల్ రాజ్ పురం , సూర్య రావుపేట , ఏలూరు రోడ్డు విషయానికొస్తే ఒకపక్క ఎక్కడ క్రమబద్ధంగా లేని మ్యాన్ హోల్స్ ఉంటాయో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాహనదారులు తెలిపారు. మరో వైపు లోతైన గోతులు, గుంటలు ఎక్కడ దర్శమిస్తాయో తెలియదు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు అంటున్నారు వాహనదారులు.
స్వచ్ఛనగరంగా అవార్డు.. రోడ్లు చూస్తే గుంతలమయం
ప్రభుత్వాలు మారిన ఈ సిటీలోని రోడ్ల పరిస్థితి మారడం లేదని…దేశంలో నిర్వహించిన స్వచ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ నగరంగా అవార్డు కైవసం చేసుకున్నవిజయవాడ.. రోడ్ల అభివృద్ధి విషయంలో మాత్రం చిట్ట చివరనే ఉందని ఈ ఇకట్లు ఎప్పుడు తీరుతాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada