K Pawan Kumar, News18, Vijayawada
ఈ రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించిన పనేదైనా, ప్రోగ్రామ్ ఎక్కడైనా అందులో అందినకాడికి దండుకోవాల్సిందే. తాజాగా విజయవాడలో అలాంటిదే జరిగింది. విజయవాడ (Vijayawada) లోని భవానీపురంలో క్రాఫ్ట్ బజార్ అంటే ప్రతి ఒక్క రు ఇష్టపడతారు. క్రాఫ్ట్ బజార్లో దొరకనిది అంటూ ఏది ఉండదు. ఐతే ఈ క్రాఫ్ట్ బజార్ నిర్వహణ వెనుక భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాఫ్ట్ బజార్లో పదుల కొద్దీ షాపులను ఏర్పాటు చేశారు. ఐతే వీటి ఏర్పాటుకు ఒక్కోక్కషాపు నుంచి రూ.60వేల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వసూళ్లన్నీ ప్రభుత్వానికి వెళ్తే పర్లేదు కానీ.. అందులో ఎలాంటి స్పష్టత లేదు. ఈ వసూలు చేసిన డబ్బంతా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిందా.. లేక రెవెన్యూ వారికా, పోలీసులకా అనేది ఎవరూ చెప్పడం లేదు.
క్రాఫ్ట్ బజార్లోని షాపుల వద్ద సరైన భద్రతా చర్యలు కూడా చేపట్టలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అంతే సంగతులు. అసలు దీనికి అనమతులే లేవనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనధికారికంగా చెల్లింపులు చేసి స్థానిక నేతల వద్ద అనుమతులు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. గతేడాది దీపావళి సమయంలో జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ సరైన ఫైర్ సెఫ్టీ పద్ధతులు పాటించకపోవడంతో ప్రాణనష్టం సంభవించింది. అలాగే ఈ మధ్యనే భవానీపురంలోని మిక్సీ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగింది.
ప్రస్తుతం భవానీపురంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ కు ఫైర్, రెవెన్యూ, పోలీసు శాఖ అనుమతులు లేనట్లు నిర్వాహకులే చెబుతున్న పరిస్థితి. మరి అనుమతులు లేకుండా క్రాఫ్ట్ బజార్ ఎలా నడుపుతున్నారు..? నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం వెనుక ఎవరున్నారనేది మాత్రం బయటకు తెలియడం లేదు. అంతేకాదు క్రాఫ్ట్ బజార్ లో స్టాల్స్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.60వేలు చొప్పున లక్షల్లో వసూలు చేశారు. మరి ఇదంతా ఎవరి ఖాతాలోకి వెళ్లిందనేది మాత్రం ఆ దుర్గమ్మకే తెలియాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada