ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల బాగా చర్చనీయాంశమవుతున్న అంశం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ (Vangaveeti Radha Krishna) హత్యకు కొందరు రెక్కీ చేశారనే అంశం. ముఖ్యంకా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకింత టెన్షన్ క్రియేట్ చేసిందీ ఈ వార్తే. తన హత్యకు కొందరు రెక్కీ చేశారని స్వయంగా రాధా ప్రకటించడం.. అది కూడా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలోనే అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. వంగవీటి రాధా వ్యాఖ్యలను కొడాలి నాని.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం.. ఆయన వెంటనే స్పందించి రాధాకు సెక్యూరిటీ పెంచడం జరిగాయి. ఐతే రాధా ప్రభుత్వ గన్ మెన్లను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఐతే రాధా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రెక్కీ చేసిన వారి గురించి ఆరా తీయాలని సీఎం జగన్ పోలీస్ శాఖను, ఇంటెలిజెన్స్ ను ఆరా తీయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఇంతవరకు రాధా అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు మాత్రం రెక్కీ అంశాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. రాధా ఆఫీసు, నివాసం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం బందరు రోడ్డులోని రాధా ఆఫీస్ వద్దకు వచ్చిన పోలీసులకు ఓ అనుమానాస్పద స్కూటీ కనిపించింది. రాధా ఆపీస్ వద్ద దాదాపు నెలరోజుల నుంచి స్కూటీ పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటీ ఎవరిది.. ఎవరిక్కడికి తీసుకొచ్చారనేది తెలియలేదు. గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీని వదిలి వెళ్లడంపై రాధా అనుచరులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని యజమాని ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉంటే రాధా హత్యకు రెక్కి చేశారంటూ వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరుడు అరవ సత్యంను పోలీసులు విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐతే అరెస్ట్ వార్తలకు ముందే ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు సత్యం కుటుంబ సభ్యులు స్పష్టతనిచ్చారు. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
రాధా చేసిన వ్యాఖ్యలపై ఇటు రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. రాధాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జీడీపీకి లేఖరాయడంపై వైసీపీ ఘాటుగానే స్పందించింది. రాధాకు సీఎం జగన్ భద్రత కల్పిస్తుంటే.. చంద్రబాబు నాటకాలాడుతున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు ద్వారనే రాధాకు ప్రాణహాని ఉందని.. ఆయనే ఆ పని చేసి పొలిటకల్ మైలేజ్ కోసం ఆ నెపాన్ని వైసీపీపై వేసే అవకాశముందని మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదంపై వంగవీటి రాధానే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆయనపై రెక్కీ చేసిందెవరు.. ఆ అవసరం ఎవరికి ఉంది..? ఎవరిపైనా అయినా అనుమానం ఉందా అనే విషయాలను రాధానే స్వయంగా ప్రకటించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన మీడియా ముందుకు వచ్చి దీనిపై స్పష్టత ఇస్తారని విజయవాడలో ప్రచారం జరుగుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vangaveeti Radha