గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక (Kondapalli Municipal Chairman election) పూర్తైంది. హైకోర్టు (AP High Court) ఆదేశాల మేరకు బుధవారం అధికారులు ఛైర్మన్ ఎన్నికను నిర్వహించారు. తొలుత కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు ఆ తర్వాత ఛైర్మన్ ఎన్నిక చేపట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున ఛైర్మన్ అభ్యర్థిగా 25వ వార్డు కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబును నిలబెట్టగా.. టీడీపీ తరపున ఉన్న కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యునిగా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్ ఛైర్మన్లుగా 29 వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్, 10 వ వార్డు టిడిపి సభ్యులు కరిమికొండ శ్రీలక్ష్మి నిలబడ్డారు.
ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించినా ఫలితాలను సీల్డ్ కవర్లో తమకు అందించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఫలితాలను ప్రకటించలేదు. ఎన్నిక వివరాలను అధికారులు కోర్టుకు సమర్పించిన అనంతరం గురువారం దీనిపై విచారణ జరగనుంది.
హైకోర్టు ఆదేశాలతో ఎన్నిక
ఇదిలా ఉంటే కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఈనెల 22న సోమవారం జరగాల్సి ఉంది. ఐతే ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎక్స్ అఫీషియో ఓటు విషయంలో వైసీపి అభ్యరంతరం తెలిపింది. దీంతో సోమ, మంగళవారాల్లో ఎన్నికను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకింది. దీంతో వివాదం హైకోర్టు వద్దకు వెళ్లింది. టీడీపీ మంగళవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారిచిన ఉన్నత న్యాయస్థానం బుధవారం పోలీస్ భద్రత నడుమ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా భద్రత కల్పించాలని విజయవాడ ఇన్ ఛార్జ్ సీపీని ఆదేశించింది. ఎన్నిక నిర్వహించిన తర్వాత ఫలితం ప్రకటించకుండా సంబంధిత వివరాలను ధర్మాసనం ముందు ఉంచాలని ఆదేశించింది.
వైసీపీ అభ్యంతరం ఇదే..!
కొండపల్లిలో 29 వార్డులుండగా 14 వైసీపీ, 14 టీడీపీ గెలిచాయి. ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఐతే వైసీపీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో ఆ పార్టీ బలం కూడా15కు చేరింది. ఇక్కడే విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మంత్రాంగం నడిపారు. కొండపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు కోసం హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకన్నారు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది.
ఐతే దీనినే వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారని.. అక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తికి కొండపల్లిలో ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. విజయవాడలో ఓటు హక్కున్న విషయాన్ని కోర్టులో దాటిపెట్టి కొండపల్లిలో ఓటు హక్కు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Municipal Corporations