రఘు అన్నా,సీనియర్ కరెస్పాండెంట్
ఏపీలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఉప ఎన్నికలు గురించే చర్చ జరుగుతుంది. రాష్ట్రం లో రాజకీయాలు శాసన మండలి ఎన్నికలకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారాయి. అప్పటి వరకు ప్రతిపక్షాలు అందుకోలేని ఎత్తులో ఉన్న అధికార వైసీపీ మండలి ఎన్నికల తర్వాత నేల వైపు చూడక తప్పని పరిస్థితులు ఏర్పడ్దాయి. 2019 ఎన్నికల తర్వాత పోటీచేసిన ఏ ఎన్నికలోనైనా సరే భారీ మెజారిటీతో గెలుస్తూ వస్తున్న వైసీపీకి మండలి ఎన్నికలలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయని చెప్పాలి. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయుల కోటా మండలి సభ్యుల స్థానాలను గంపగుత్తగా కైవసం చేసుకున్న వైసీపీ పట్టభధ్రుల నియోజకవర్గాలలో మాత్రం 3/0 తేడాతో ఓడిపోయింది.
అయితే పట్టభధ్రులు మా ఓటర్లు కాదంటూ ప్రభుత్వ పెద్దలు మీడియా ముందు బుకాయించినప్పటికీ అన్ని లక్షల ఉద్యోగాలిచ్చాం,ఇన్ని లక్షల ఉద్యోగాలిచ్చాం అంటూ ఊదరగొడుతున్నప్పుడు ఆ ఉద్యోగాలు పొందిన వారు ప్రభుత్వ లభ్ధి దారుల కాకుండా ఎలాపోతారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నారు. 5లక్షల మందికి పైన ఉన్న వార్డు వాలెంటీర్లు, సచివాలయ సిబ్బంది కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయలేదనే ప్రచారమూ లేక పోలేదు.
ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే శాసన సభ్యుల కోటా స్థానాన్ని కోల్పోవడంతో వైసీపికి గట్టి షాకే తగిలింది.తమ పార్టీ తరఫున నిలబడిన ఏడుగురు అభ్యర్ధులు గెలవడానికి సరిపడా బలం ఉన్నప్పటికీ సొంత పార్టీ నుండి నలుగురు శాసన సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒకే ఒక స్థానంలో పోటీచేసిన తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో వైసిపి అధిష్టానం ఒకింత షాక్ కు గురైందనే చెప్పాలి. ఆ తరువాత జరిగిన పరిణామాల లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే అనుమానంతో వైసిపి తన సొంత శాసనసభ్యులు నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వస్తాయనుకున్న నాలుగు మండలి స్థానాలు రాక పోగా ఉన్న వారిలో నలుగురు శాసనసభ్యులను కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి.
ఇంత వరకు పరిణామాలు ఎలా ఉన్నా సస్పెండ్ చేసిన శాసనసభ్యుల పై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని సమాచారం. ఐతే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న ఈ పరిస్థితులలో తమ సిట్టింగ్ స్థానాలలో ఉపఎన్నికలకు వెళ్ళి ఒక్కసీటు కోల్పోయినా అది పార్టీకి తీవ్రమైన నష్టం చేకురుస్తుందనేది కొందరు పార్టీ పెద్దలవాదనగా ఉందంట. పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో గెలుపుపై ధీమా ఉన్నా రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండలో మాత్రం గెలవడం అంత తేలికైన విషయం కాదని...అక్కడ గానీ ఓడితే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగన్ కి ఉప ఎన్నికలు కొత్తకాదు,చగెలుపోటములు కొత్త కాదు. ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ నాలుగు నెలల పాటు రాష్ట్రంలో పరిపాలన స్థంభించి ప్రజలకు నష్టం జరుగుతుందని ఆలోచిస్తున్నాం అంటున్నారు అధికార పార్టీ నేతలు.
సస్పెండైన శాసనసభ్యులను అలా వదిలేస్తే చాలు వారి రాజకీయజీవితం అంధకారమౌతుందని, ఉప ఎన్నికలు అంటూ వెళితే వారికి మరో అవకాశం ఇచ్చిన వారమౌతామంటున్నారు వైసిపి పెద్దలు. ఇప్పటికే శాసన మండలి ఎన్నికలలో ఓటమి పై అధినేత అసంతృప్తితో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. బాగా మొండి వాడు అని పేరున్న ముఖ్యమంత్రి జగన్ ఆ నలుగురి విషయంలో ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కాలమే నిర్ణయిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, AP Politics, Cm jagan, Local News