దేశానికే ఏపీ పోలీసులు రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, పోలీస్ సేవలు అత్యున్నత ప్రమాణాలతో ఉంటున్నాయని సీఎం జగన్ అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలో దుష్టశక్తులను ఎదురిస్తున్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్కచేయని మనందరి సైనికుడే మన పోలీసు సోదరుడు అని సీఎం జగన్ కొనియాడారు. మహిళలకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో తీసుకునే సమయం 160 రోజుల నుంచి 42 రోజులకు తగ్గంచి పోలీస్ వ్యవస్థ మెరుగైన సేవలు అందిస్తోందని తెలిపారు. కేవలం 42 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులను న్యాయస్ధానం ముందు నిలబెట్టే ఒక గొప్ప మార్పు రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు.
ప్రజల కోసం అమర వీరులైన పోలీసులు, త్యాగధనులైన పోలీస్ కుటుంబాలకు ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నానన్నారు. గత ఏడాదిలో విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా 261 మంది పోలీసులు అమరులైతే ఏపీ నుంచి పదకొండు మంది ఉన్నారని ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కుంటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ పక్కాగా అమలు చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విధి నిర్వహణలో పోలీసులపై ఒత్తిడి తగ్గించేందుకే వీక్లీ ఆఫ్ వ్యవస్థ తెచ్చినట్లు వివరించారు. సిబ్బంది కొరత వల్ల పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ అమలుకు ఇబ్బంది కలగకూడదని పోలీస్ శాఖలో 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గత ప్రభుత్వం హయాంలో కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రటించారు. పోలీస్ సిబ్బంది సమస్యలన్నింటిని తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
1.33 కోట్ల మహిళల చేతిలో దిశ యాప్
మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తమ ప్రభుత్వం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోందని సీఎం జగన్ వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు అతి తక్కువ సమయంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మూడున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థలో సంస్థాగత మార్పులు తెచ్చినట్లు వివరించారు. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లతో దేశానికే ఆదర్శంగా నిలిచి, మెరుగైన సేవలు అందిండం అందులో భాగమేనన్నారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు తమ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఇప్పటి వరకు 1,237 చోట్ల ఆపద జరగకముందే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Local News, Vijayawada