ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్నందున రోగులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సరిపడా బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి ప్రజలు అప్పులు పాలవుతున్నారు. అయినా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం కొవిడ్ బాధితులకు చికిత్స అందించే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆస్పత్రుల్లో ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా NABH అక్రిడేషన్ కలిగిన ఆస్పత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు మరో ధరను ప్రభుత్వం నిర్ణయించింది. నాన్ క్రిటికల్ కేర్ కోసం ఎన్ఏబీ హెచ్ అక్రిడేషన్ కలిగిన అస్పత్రుల్లో రూ.4వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రులు రూ.3600 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆక్సిజన్ తో కూడిన కోవిడ్ ట్రీట్ మెంట్ ఇస్తే.. రోజుకు రూ.6500, అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు రూ.5,850 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. క్రిటికల్ కేర్ కోసం ఐసీయూ, వెంటిలేటర్ల కోసం రోజుకు రూ.12 వేలు, రూ.16 వేలుగా ఫీజుల నిర్ధారిస్తూ ఆదేశాలిచ్చింది. అక్రిడేషన్ లేని ఆస్పత్రులకు రోజుకు ఐసీయూకి రూ.10,800, వెంటిలేటర్ కు రూ.14,400 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లో కన్సల్టెన్సీ, నర్సింగ్ ఫీజులు, రూమ్ రెంట్, పేషెంట్ కు అందించే భోజనం, కోవిడ్ టెస్ట్ ఛార్జ్, పీపీఈ కిట్లు, మందులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొవిడ్ ఆస్పత్రులుగా నోటిఫై అయిన వెంటనే కరోనాకు చికిత్స ప్రారంభించాలని.. ఎట్టిపరిస్థితుల్లో నిరాకరించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు కొవిడ్ బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోవద్దని పేర్కొంది. ఇక సీటీ స్కాన్ కోసం రూ.3 వేలు, రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ.2,500, టాక్లిజూమబ్ కు రూ.30 వేలు మాత్రమే ఛార్జి చేయాలని పేర్కొంది. అలాగే ధరల వివరాలను ఆస్పత్రి బయట ప్రదర్శించాలన్నారు.
పాత ఫీజులు ఇలా..
గతంలో ప్రైవేటు ఆస్పత్రులకు నిర్దేశించిన ఫీజుల వివరాలను పరిశీలిస్తే.., నాన్ క్రిటికల్ కరోనా పేషెంట్లకు వైద్యానికి రోజుకు రూ.3.250, క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎస్ఏవీ లేకుండా ఉంచితే రోజుకు రూ.5,480, ఎన్ఎస్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ.5,980, వెంటిటేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ.9,580, వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ.6,280, వైరస్ ఉండి వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ.10,380గా ఉంది. తాజాగా ప్రభుత్వం ధరలను పెంచడంతో వీటికంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలుంటే 104 కాల్ సెంటర్ లేదా, స్పందన కాల్ సెంటర్ 1902కు చెప్పొచ్చని అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona virus