VIJAYAWADA ANDHRA PRADESH CRIME NEWS POLICE TAKE SERIOUS ACTION ON DRUGS IN COURIER PARCEL NGS
Drugs Supply: ఏపీని కలవర పెడుతున్న డ్రగ్స్ సప్లై.. కొరియర్ ద్వారా రావడంపై విచారణ వేగవంతం
ప్రతీకాత్మక చిత్రం
Drugs Supply In Courier: ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ సరఫరా రోజు రోజుకూ పెరుగుతోంది. పోలీసులు గట్టి నిఘా పెట్టినా.. పార్శిళ్లు.. ఈ కామర్స్ సంస్థల పేరుతో కూడా ఈ సరఫరా ఆగడం లేదు. తాజాగా విజయాడకు.. కొరియర్ ద్వారా నిషేధిత డ్రగ్స్ సరఫరా అవ్వడం కలకలం రేపింది.
Drugs Supply In Courier: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్ సరఫరా కలవర పెడుతోంది. తాజాగా విజయవాడ (Vijayawada)లో కొరియర్ ద్వారా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో విచారణ వేగవంతం చేశామని విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ భాషా అన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందాన్ని గుంటూరు జిల్లా (Guntur District) సత్తెనపల్లికి, మరో బృందాన్ని హైదరాబాద్ (Hyderabad) కు, ఇంకో టీమ్ ని బెంగళూ (Bangalore)రుకి పంపించారు. అయితే ఈ కేసులో తేజ (Teja), సాయిగోపి (Sai Gopi)కి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. తేజ కుటుంబ సభ్యులను పిలిచి విచారిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తేజను బెంగళూరు కస్టమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఏసీపీ వెల్లడించారు. అలాగే విజయవాడలో ఉన్న కొరియర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా కొరియర్ సర్వీస్సుల్లో ఇలాంటి పనులు చేస్తున్నారా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.
చాలా రోజుల నుంచి విజయవాడలో డ్రగ్స్ వాడకంపై ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా వేసే ఉంచారు. తాజాగా మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సాయిగోపి అనే వ్యక్తి పంపిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నట్లు బెంగళూరులో గుర్తించారు. దీన్ని గురించి పోలీసులు ఆరా తీయగా విజయవాడలోని కొరియర్ సర్వీస్ పేరు తెరపైకి చ్చింది. ఈ పార్సిల్ను విజయవాడ డీటీఎస్ కొరియర్ నుంచి ఆస్ట్రేలియాకు పంపగా వివరాలు సరిగా లేక కెనడాకు వెళ్లింది. కెనడా నుంచి వెనక్కి వస్తుండగా.. బెంగళూరులో డ్రగ్స్ పార్సిల్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అందులో నాలుగు కేజీల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ డ్రగ్ పార్సిల్ ను సరఫరా చేసిన కొరియర్ బాయ్ తేజను గత నెల 27న బెంగళూరు పిలిపించిన కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా కొరియర్ కార్యాలయంలో సాయిగోపి ఇచ్చిన ఆధార్ కార్డు నకిలీదని గుర్తించారు. అలాగే పట్టుబడిన పార్సిల్లో పిరిడిన్ అనే నిషేధిత డ్రగ్ను ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తరువాత కస్టమ్స్ అధికారులు విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు.
స్థానిక పోలీసులు దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సాయిగోపి ఇటీవల రెండు సార్లు పచ్చళ్ల పార్సిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో నిజంగా పచ్చళ్లు పంపాడా? లేదా దీనిలాగే పచళ్ల పేరుతో డ్రగ్స్ను పంపాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇటీవల గుజరాత్లోని ఓ పోర్టులో పట్టుకున్న డ్రగ్స్ను పంపిన చిరునామా విజయవాడలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
గుజరాత్ ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసులో విజయవాడకు ప్రమేయం ఉందన్న వార్తలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. డ్రగ్స్ పై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా ముంద్రా పోర్టుకు హెరాయిన్ సరఫరా అయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విజయవాడ సత్యనారాయణపురం గడియారం వారి వీధిలోని ఇంటి నెంబర్ 23-14-16 చిరునామాతో మాచవరం సుధాకర్ ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. ఎన్ఐఏ అధికారులు ఆ ఇంట్లో సోదాలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.