విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత బిజీగా ఉంటుందో తెలుసు. నిత్యం వందలాది రైళ్లు అటువైపుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ జంక్షన్గా ఉంది. అయితే తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్లో భారీగా బంగారం పట్టుకున్నారు అధికారులు. దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు రైల్వేస్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. తమిళనాడు నుంచి ఏపీకి పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది.
దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాశారు. ఈ సందర్భంగా అనుమానాస్పందగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 5 కేజీల బంగారం లభించింది. అనంతరం వారిని ప్రశ్నించగా మరికొందరి సమాచారం లభించింది. దీంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపంలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు ? ఈ దందా ఎక్కడ నుంచి నడుస్తుంది ఇలా అనేక రకాల విషయాలపై ఆరా తీస్తూ విచారణ చేపట్టారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold smuggling, Local News, Vijayawada