ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రోడ్లు రక్తమోడాయి. రోడ్డు ప్రమాదాలు పెళ్లింట విషాదాన్ని నింపాయి. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది బలయ్యారు. ఓ ఘటనలో ఏకంగా కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం కృష్ణా జిల్లా (Krishna District) లో ఘోర ప్రమాదం జరిగింది. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామానికి చెందిన పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెదప్రోలులో జరిగే పెళ్లికి ఆటోలో వెళ్లగా చల్లపల్లి వద్ద కాశానగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తాపడింది. ఘటనలో ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి స్పాట్లోనే మృతి చెందారు. పలువురుకి తీవ్రగాయాలవగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నారు.
ఘటనాస్థలిలో గాయపడిన వారు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయానకంగా మారింది. అప్పటివరకు సందడిగా సాగిన ప్రయాణం రోడ్డు ప్రమాదంతో విషాదంగా మారింది. ఐతే ఆటోలో 21 మంది ప్రయాణికులు ఉండటంతో అంత బరువుమీద కంట్రోల్ కాకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా (Annamayya District) లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి మండలంలోని పుంగనూరు రోడ్డులో 150 మైలు వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. అతివేగంగా కారుణంగా అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీ కొట్టి చెరువులో బోల్తాపడింది. మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డిపల్లికి చెందిన గంగిరెడ్డి కుటుంబంగా గుర్తించారు. మృతులు గంగిరెడ్డి, మాధవీలత, కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. అతివేగంతో తప్పిన కారు కల్వర్టును ఢీకొట్టి చెరువులో బోల్తాపడింది. మృతులు పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అప్పటివరకు పెళ్లిలో ఎంతో సరదాగా గడిపిన కుటుంబం అంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారులు కూడా మృతి చెందడం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో అతికష్టమ్మీద బయటకు తీశారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా (Chittoor District) లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హేవేపై వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని డీ కొట్టింది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో విజయనగరం జిల్లా నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబంలోని ఆరుగురు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబంలో చిన్నపాప తప్ప అందరూ మరణించడం ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.