ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ 108, 104 సేవలను మరింత విస్తృతంగా వినియోగిస్తోంది. కోవిడ్ అత్యవసర పరిస్థితుల్లో 104 కాల్ సెంటర్లను మరింత బలోపేతం చేసి, ఫోన్ చేసిన వెంటనే వైద్యబృందాలు కోవిడ్ పేషంట్లకు వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. గ్రామ సచివాలయాన్ని ప్రాతిపాదికగా తీసుకుని రాష్ట్రంలో 104 వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా గత నెల (ఏప్రిల్) 1 నుంచి 27వ తేదీ వరకు గ్రామాల్లో 104 అంబలెన్స్ల ద్వారా 5,97,765 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించింది. 5,67,378 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు గ్రామంలో అందుబాటులో వుంటూ, మంచానికే పరిమితమైన పేషంట్లను వారి ఇళ్ళవద్దనే వైద్యులు పరీక్షించి, అవసరమైన పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందించడం చేస్తున్నారు. గత నెలలో 104 అంబులెన్స్ వైద్యబృందాలు 70,604 మంది పేషంట్లకు వారి ఇళ్లవద్దకే వెళ్ళి వైద్యసేవలు అందించారు.
కరోనా విపత్తులో 108 అంబులెన్స్లు ప్రజల పాలిట అపర సంజీవనిలా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ పేషంట్లను ఆసుపత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోవిడ్ 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ అంబులెన్స్లు బిజీగా వున్న పరిస్థితుల్లో పేషంట్లకు అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించేందుకు నాన్ కోవిడ్ పేషంట్లకు వినియోగించే 108 అంబులెన్స్లను కూడా అవసరానికి అనుగుణంగా వినియోగిస్తోంది.
గత నెల (ఏప్రిల్) 1 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ల్లో ఆసుపత్రులకు తరలించిన నాన్ కోవిడ్ పేషంట్లు 66,173 మంది కాగా, కోవిడ్ పేషంట్లు 12,208 మంది. రాష్ట్రంలో కోవిడ్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్లు 124 కాగా, వాటి ద్వారా ఆసుపత్రులకు 4,119 మంది కరోనా పేషంట్లను ఆసుపత్రులకు తరలించారు. అవసరాన్ని బట్టి కోవిడ్ పేషంట్ల కోసం వినియోగించిన ఇతర 108 అంబులెన్స్లు 544 కాగా, వీటి ద్వారా 8080 మంది కోవిడ్ పేషంట్లను ఆసుపత్రులకు తరలించారు.
నాన్ కోవిడ్ పేషంట్లకు కేటాయించిన అంబులెన్స్లను కోవిడ్ పేషంట్లకు వినియోగించిన అనంతరం వాటిని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వైద్యులు ధ్రువీకరించిన తరువాతే వాటిని మళ్ళీ సాధారణ పేషంట్ల కోసం వినియోగిస్తున్నారు. కోవిడ్ పేషంట్లను తరలించిన నాన్ కోవిడ్ అంబులెన్స్ల్లో స్ట్రెక్చర్, కంట్రోల్ ప్యానెల్స్, ఫ్లోర్, వాల్స్, వర్క్ సర్ఫేస్ లను ఒకశాతం హైపోక్లోరైట్ సొల్యూషన్తో శానిటైజ్ చేస్తున్నారు. అలాగే పేషంట్ కు వినియోగించిన పరికరాలను ఆల్కహాల్ బెస్డ్ లిక్విడ్తో శుభ్రపరుస్తున్నారు. మొత్తం అంబులెన్స్లో ఒక లీటరు హైపోక్లోరైట్ ద్రావణంలో పదిలీటర్ల నీటిని చేర్చి పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై ఇప్పటికే ఎమర్జెన్సీమెడికల్ టీంలకు, అంబులెన్స్ పైలెట్కు అవసరమైన శిక్షణ ఇచ్చారు.
అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ల్లో పూర్తిగా నింపిన రెండు ఆక్సీజన్ సిలెండర్లు, వెంటీలేటర్, డెఫిబ్రిల్లేటర్ పరికరాలను అందుబాటులో వుంచి అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లనుకానాడేందుకు వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే బృందాలకు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.