తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం గురువారం జరుగనుంది. లాక్డౌన్ ఉన్నప్పటికీ టీటీడీ నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒక్క సారి సమావేశం నిర్వహించాల్సి ఉండడంతో పాలకమండలి రేపు సమావేశంకానుంది. అయితే టీటీడీ పాలకమండలి చరిత్రలో మొదటిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. తిరుమల నుంచి సమావేశానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎక్స్ ఆఫీసియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్రెడ్డి హాజరుకానున్నారు. కాగా, మిగిలిన సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హాజరవుతారు. అయితే ఈ సమావేశంలో 60 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ ఆస్తుల విక్రయంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆస్తుల విక్రయంపై స్వామీజీల అభిప్రాయాలు తీసుకుని కమిటీ వేయడానికి టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. లాక్డౌన్ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శ్రీవారి దర్శనాలకు అనుమతి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే అంశంపైనా చర్చించనున్నారు. రిటైర్మెంట్లతో పనిభారం ఎక్కువ కావం వల్ల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలోని పారిశుద్ధ్య పనులు, అతిథిగృహాల నిర్వహణకు టీటీడీ టెండర్లు పిలవనుంది. ఎనిమిది ప్రాంతాల్లో కొత్త కాంట్రాక్టులను ఎంపిక చేయనుంది. తిరుపతిలో రూ.672కోట్ల వ్యయంతో ప్రారంభించిన గరుడ వారధి ప్రాజెక్టు నిధుల లేమితో ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిధుల కేటాయింపుపై చర్చించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.