ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ అనే అంశంపై మరోసారి డైలమా కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని వెల్లడించింది. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా ఏపీకి రాజధానులుగా ఉంటాయని ప్రకటించింది. అయితే దీనిపై న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీ రాజధానిగా కేంద్రం ఏ ప్రాంతాన్ని గుర్తిస్తుందనే అంశంపై కూడా వివాదం నడుస్తోంది. అమరావతిని కేంద్రం ఏపీ రాజధానిగా గుర్తించడం లేదనే వాదన మొదలైంది.
ఈ నేపథ్యలో దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులకు కేంద్ర హోం శాఖ సమాధానమిచ్చింది. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపింది. ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉన్నందున సమాచారమివ్వడం కుదరదని హోంశాఖ వెల్లడించింది. దరఖాస్తును అప్పిలేట్ అథారిటీకి పంపుతున్నట్టు వెల్లడించింది. మరోవైపు అమరావతి నుంచి ఏపీ పరిపాలన రాజధానిని విశాఖకు మార్చుతామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటోందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిరోజుల క్రితం ఈ అంశంపై మాట్లాడారు. వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సైతం విశాఖను ఏపీ పరిపాలన రాజధాని కాకుండా అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని పలుసార్లు తెలిపారు. త్వరలోనే విశాఖ నుంచి ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Union Home Ministry, Visakhapatnam