Cyclone Nivar affect in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తుఫాన్లు వదిలేలా లేవు. ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు వణికిపోతున్నాయి. మిగిలిన కొన్ని జిల్లాలో కూడా భారీ ప్రభావం చూపించినా.. ఈమూడు జిల్లాల్లో భారీగా ఉంది. ఇప్పుడు మరో హెచ్చరిక జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. ఈనెల 29న బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం (Low pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Rreport) పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్తా తుఫాన్గా (Cyclone) మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్2న 'బురేవి తుఫాన్' (Cyclone Burevi) తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో 'టకేటి తుఫాన్' (Cyclone Taketi) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబరు 7 తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) నేడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్షించనున్నారు. నివర్ తుఫాన్పై నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటలకు డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. వరద సహాయక శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు.
నివర్ తుఫాన్ ప్రభావం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లా ల్లో బాగా ఉంది. అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇటువంటి ప్రాంతాలలో అగ్నిమాపక సిబ్బంది 24గంటలూ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారని ఆ శాఖ డీజీ ఎండీ హసన్ రాజా తెలిపారు. వందల మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ‘మూడు రోజులుగా మా సిబ్బంది తుఫాన్ ప్రాంతాలలో ప్రజల రక్షణ చర్యలు చేపట్టారు. నెల్లూరు లో 12, చిత్తూరు లో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశం లో 11 టీం లు (Rescue Operation) పని చేస్తున్నాయి.’ అని చెప్పారు.
నివర్ తుఫాన్ సమయంలో మూడు జిల్లాల్లో 87 టీంలుగా 523 మంది పనిచేస్తున్నారని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ కె.జయరాం నాయక్ తెలిపారు. కడప జిల్లా లో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడామన్నారు. కాళహస్తి లో వరదలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడినట్టు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అక్కడి సిబ్బందికి లక్ష రూపాయలు బహుమానంగా ప్రకటించారని చెప్పారు. SDRF, NDRF ల కన్నా స్థానికంగా అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఎక్కువుగా ఉంటుందన్నారు. అందువల్ల ఎక్కడ ప్రకృతి విపత్తులు కలిగినా ఆయా ప్రాంతాలలో సిబ్బంది ని అలెర్ట్ చేస్తున్నామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cyclone Nivar, WEATHER