హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala: ఆటోమేటిక్ యంత్రాలతో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ.. ఏకంగా రూ.50 కోట్లు.!

Tirumala: ఆటోమేటిక్ యంత్రాలతో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ.. ఏకంగా రూ.50 కోట్లు.!

తిరుమల లడ్డూ

తిరుమల లడ్డూ

Tirumala: జనవరి నెలలో 20.78 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 7.51 లక్షల మంది తలనీలాలను సమర్పించారు. హుండీ కానుకలు రూపంలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

తిరుమలలో లడ్డూ తయారీ (Tirumala Srivari Laddu) కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో (TTD EO) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడిన ఆయన.. తిరుమలకు సంబంధించి పలు కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు.

జనవరి 28న తిరుమలలో (Tirumala) నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని.. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించాని చెప్పారు ధర్మారెడ్డి. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుందన్న ఆయన.. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించేందుకు... బెంగళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించినట్లు చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని.. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తామని టీటీడీ ఈవో చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని.. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని స్పష్టం చేశారు.

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించామన్నారు ధర్మారెడ్డి. ''తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతోంది.'' అని పేర్కొన్నారు.

యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారు. ఇక, జనవరి నెలలో 20.78 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 7.51 లక్షల మంది తలనీలాలను సమర్పించారు. హుండీ కానుకలు రూపంలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. జనవరిలో 1.07 కోట్లు లడ్డూలను విక్రయించారు. 37.38 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Tirumala, Tirupati

ఉత్తమ కథలు